
ఒకేసారి మాఫీ చేసుంటే ఆత్మహత్యలుండేవి కావు
ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఏకమొత్తంగా మాఫీ చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్పక్ష ఉపనేత టి.జీవన్రెడ్డి పేర్కొన్నారు...
- అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చలో జీవన్రెడ్డి
- లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.60 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఏకమొత్తంగా మాఫీ చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్పక్ష ఉపనేత టి.జీవన్రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీని దశలవారీగా అమలు చేసి రైతులను సమస్యల్లోకి నెట్టేశారని విమర్శించారు. ఇప్పటికైనా మిగిలిన రుణాలను ఒకేమారు మాఫీ చేయాలని కోరారు. ధనిక రాష్ట్రమంటూ గొప్పలకు పోయి కరువు మండలాల ప్రకటనపై ఆలస్యం చేయడం మంచిపద్ధతి కాదన్నారు. దీనివల్ల రుణాల రీషెడ్యూల్ జరగక రైతులకు సమస్యలొస్తున్నాయని వాపోయారు. మంగళవారం రుతుపవనాల వైఫల్యం, రైతుల సంక్షేమంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవన్రెడ్డి మాట్లాడారు.
గతఏడాది జూన్, జూలైలో ఖరీఫ్ ఆరంభమైతే రుణమాఫీపై సెప్టెంబర్ వరకు తన విధానాన్ని ప్రభుత్వం ప్రకటిం చలేకపోయిందని, అదీ కేవలం 25 శాతం రుణాలను మాత్రమే మాఫీ చేయడంతో ఏ ఒక్క రైతుకు రూ.25 వేలకు మించి రుణం పొందే అవకాశం దక్కలేదన్నారు. ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో వడ్డీలు కట్టకపోవడంతో వారు సైతం రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్నారు. ‘పంటలు నష్టపోయి, పెట్టుబడులు సమకూర్చుకోలేక, రుణమాఫీ పొందలేక, కుటుంబ సమస్యలు పెరిగి రైతులు ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 1,400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని ఆదుకుంటే ప్రభుత్వానికి రూ.60-70కోట్లు ఖర్చవుతాయి. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈ మాత్రం వెచ్చించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు.
గతంలో పంటల దిగుబడి తగ్గినప్పుడు ప్రభుత్వాలు బోనస్ ప్రకటించాయని జీవన్రెడ్డి గుర్తుచేశారు. 2004-05, 2005-06లో వరిపై కేంద్రం నిర్ణయించిన ధరకు అప్పటి ప్రభుత్వం రూ.50 బోనస్గా ప్రకటించిందని చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.5వేల ప్రోత్సాహకం సైతం అందజేశారన్నారు. వరి, మొక్కజొన్నకు రూ.200, పత్తి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. గత ఏడాది ఈదురుగాలులతో నష్టపోయిన పం టలకు ఇంతవరకూ ప్రభుత్వం రూపాయి చెల్లించలేదని, ఉద్యానవన పంటలకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుల్లోనూ జాప్యం చేస్తున్నారని విమర్శించారు. చెరుకు రైతుల బకాయిలు చెల్లించేందుకు మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలన్నారు.
రైతులకిస్తే తప్పేంటి?
ఇక ట్రాక్టర్ కలిగి ఉన్నాడనే కారణంతో రైతులను ఆసరా పింఛన్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు. డెంగీ వంటి రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రైతులందరికీ ఆరోగ్యకార్డులు ఇవ్వాలన్నరు. ఉద్యోగికి వచ్చే ఆదాయంలో 10శాతం ఆదాయం లేని రైతుకు ఆరోగ్యకార్డు ఇస్తే తప్పేంటన్నారు.