ఢిల్లీ మాజీ మంత్రికి అక్కడి కోర్టులో భంగపాటు ఎదురైంది. భార్యను హింసించిన కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఆయనపై భార్య గృహ హింస కేసు పెట్టడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు తప్పక ఆయనను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలని కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను కొట్టివేయడంతో భంగపాటు కలిగింది.
అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో న్యాయశాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సోమనాథ్ భారతీపై అనతి కాలంలోనే ఆయన భార్య తనను చిత్ర హింసలు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దాదాపు మూడు నెలలపాటు పరిశీలనలు జరిపిన పోలీసులు భార్యాభర్తలను ఓచోట చేర్చి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ, వారిద్దరి మధ్య ఈసమస్య కొలిక్కి రాకపోవడంతో గత వారమే ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఏ క్షణమైనా పోలీసులు సోమనాథ్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.