దొంగను వెంటాడి పట్టుకున్న అక్కాచెల్లెళ్లు
ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లేందుకు యత్నించిన దొంగను ఇద్దరు సోదరీమణులు సాహసోపేతంగా అడ్డుకున్నారు.
భోపాల్: ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లేందుకు యత్నించిన దొంగను ఇద్దరు అక్కాచెల్లెళ్లు సాహసోపేతంగా అడ్డుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగను వెంటాడి మరీ పట్టుకున్నారు. భోపాల్ లోని షాహ్ పూరా ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
దివ్య ద్వివేది(28), ఆమె సోదరి శివ్యా(21) తమ రూములో విశ్రాంతి తీసుకుంటుండగా దొంగ ఒకడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. ల్యాప్ టాప్ దొంగిలించి పారిపోయేందుకు యత్నించాడు. దొంగను గమనించిన అక్కాచెల్లెళ్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతడు కాలికి బుద్ధి చెప్పడంతో వారు కూడా పరుగు తీశారు. చివరికి స్థానికుల సహాయంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నిందితుడు సంజయ్ థాకూర్ గా గుర్తించారు. ఇదే ఇంటిలో జనవరి 7న అతడు దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి దొంగను పట్టుకున్న విద్య, శివ్యాలను మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ అభినందించారు. వారిని సాహస పురస్కారాలతో గౌరవిస్తామని తెలిపారు.


