తీరనున్న దాహార్తి | Water on the grid to complete the survey nap | Sakshi
Sakshi News home page

తీరనున్న దాహార్తి

Nov 23 2015 1:45 AM | Updated on Sep 18 2019 2:55 PM

వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని 17 మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు అధికారులు ....

వాటర్‌గ్రిడ్‌పై నాప్ సర్వే పూర్తి 
పాలేరు నుంచి నీటి సరఫరాకు చర్యలు
గ్రిడ్ నిర్మాణానికి  స్థలాల పరిశీలన
కొనసాగుతున్న రీ సర్వే
17 మండలాలకు రూ.1700 కోట్లు కేటారుుంపు

 
మహబూబాబాద్ : వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని 17 మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించిన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1700 కోట్లు కేటారుుంచింది. ప్రతి మండలంలోనూ గ్రిడ్ నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దాహార్తి తీరుతుందా అని ఆయూ మండలాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్ నుంచి కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వస్తే.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా మరిపెడ సమీపంలోని మాదిరిపురం గుట్టపై 170 ఎంఎల్‌డీ (మిల్లి లీటరు ఫర్ డే) సామర్థ్యం గల ట్యాంకును నిర్మిస్తారు. దీంతో పాటు మూడు జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు), ఒక ఓహెచ్‌బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్) నిర్మిస్తారు. గుట్ట కింది భాగంలో ఫిల్టర్‌బెడ్(వాటర్  ట్రీట్‌మెంట్ నిర్మాణాలు) నిర్మించి.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేస్తారు. ఒక జీఎల్‌బీఆర్ నుంచి మరిపెడ మండలానికి, రెండవ జీఎల్‌బీఆర్ నుంచి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం మండలాలకు, మూడవ జీఎల్‌బీఆర్ నుంచి నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, రాయపర్తి మండలాలకు నీరందించేలా మ్యాప్ తయారు చేశారు. ఓహెచ్‌బీఆర్ నుంచి గూడూరు మండలం బొద్దుగొండ వద్ద సంప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొత్తగూడ, దుగ్గొండి, నెక్కొండ, ములుగు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు నీరు సరఫరా చేయనున్నారు. ఆ ట్యాంకుల నుంచి ఇంటర్నల్ పైపులైన్లు నిర్మించి బొడ్లాడ, మొరిపిరాల, ఇతరత్రా గ్రామాలకు కూడా నీరందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఈ అన్ని మండలాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీరు, అర్బన్‌లో 135 లీటర్ల నీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి మండలంలో సంప్, ఇతరత్రా నిర్మాణాల కోసం అధికారులు స్థలాల పరిశీలిస్తున్నారు. మానుకోటలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న గెస్ట్‌హౌస్‌ను గ్రిడ్ కార్యాలయానికి ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఈ పనుల కోసం మ్యాప్ సర్వే పూర్తయినట్లేనని అధికారులు చెపుతుండగా.. కాంట్రాక్టర్ మాత్రం రీ సర్వే చేస్తున్నారని, అది పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అన్ని మండలాల్లో స్థలాలను పరిశీలించి అంతర్గతంగా ఇతరత్ర నిర్మాణాలు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు. అరుుతే ఆయా మండలాల్లో గతంలో నిర్మించిన ట్యాంకులు ఉపయోగపడుతాయా లేక కొత్తగా నిర్మించాలా అనేది నీటి సరఫరా ప్రారంభమైతేనే తెలియనుంది. అధికారుల కృషి ఫలించి గ్రిడ్ సక్సె స్ అయితే.. మానుకోట పట్టణ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుంది.   
 
 30 నెలల్లో గ్రిడ్ పూర్తికావాలి..
వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన నిర్మాణాలు 30 నెలల్లో పూర్తి కావాలని ఒప్పందం జరిగింది. సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న గెస్ట్‌హౌస్‌ను గ్రిడ్ కార్యాలయానికి కేటాయించారు. గ్రిడ్‌కు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, మానుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలకు, పాలకుర్తిలోని 2 మండలాలకు, ములుగులోని ఒక మండలానికి నీరందించేలా మ్యాప్‌తో పాటు సర్వే కూడా పూర్తయింది. డీఈలు గంగాధర్, శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు.
 -  కె.రాములు, ఈఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement