కోటయ్య నేతృత్వంలో ‘రుణమాఫీ’ కమిటీ | Waivers committee for lead on Kotaiah | Sakshi
Sakshi News home page

కోటయ్య నేతృత్వంలో ‘రుణమాఫీ’ కమిటీ

Jun 13 2014 1:44 AM | Updated on Oct 1 2018 2:03 PM

రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాఫీపై విధివిధానాలు రూపొందించడానికి నాబార్డు మాజీ చైర్మన్ పి.కోటయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

కన్వీనర్‌గా ఆర్ధిక శాఖ కార్యదర్శి  ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
 సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణమాఫీపై విధివిధానాలు రూపొందించడానికి నాబార్డు మాజీ చైర్మన్ పి.కోటయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం సిద్ధమైన జీవో గురువారం బయటకొచ్చింది. ఖరీఫ్ రుణాల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నియామకమైన తేదీ నుంచి రెండు వారాల్లో ఈ కమిటీ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.
 
 తుది నివేదికను 45 రోజుల్లో సమర్పించాలి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఎస్ రావు, ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎ.ఎల్ నాగేశ్వరరావు, ఆర్థికరంగ విశ్లేషకుడు సి.కుటుంబరావు, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి (ఐఎఫ్) దీనికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. వ్యవసాయ పంట రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు తదితర రుణాల మాఫీపై ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కమిటీ విధివిధానాలను కూడా అందులో స్పష్టం చేశారు.
 
 ఇవీ విధివిధానాలు
 - పంట రుణాలు, డ్వాక్రా రుణాల రద్దుకు సంబంధించి సరైన ప్రతిపాదనలివ్వాలి.
 - మహిళలు పంటల సాగుకోసం బంగారం కుదవ పెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నాయో తెలపాలి.
 - అర్హులైన వారికి ఈ రుణమాఫీని అమలు చేయడానికి అవసరమైన విధానాలు సూచించాలి
 - ఈ ప్రతిపాదనల అమలుకు అవసరమైన నిధులు ఎలా సమీకరించాలో సూచించాలి.
 - కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వడ్డీ మాఫీ పథకం రుణమాఫీ పథకానికి ఎలా ఉపకరిస్తుందో అధ్యయనం చేయాలి
 - నివేదిక తయారీకి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement