రాష్ట్రంలో 6 వేల మంది రోహింగ్యాలు | TS Reported 6 Thousand Rohingyas In The State Says Kishan Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 6 వేల మంది రోహింగ్యాలు

Sep 27 2019 3:43 AM | Updated on Sep 27 2019 5:25 AM

 TS Reported 6 Thousand Rohingyas In The State Says Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా రోహింగ్యాల వివరాలను సేకరిస్తున్నామని, రాష్ట్రంలో 6 వేల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఈ లెక్కలు తేలాయని, అందులో కొంత మందికి ఆధార్‌ కార్డులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మందగమనం విషయంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజలను భయాందోళనలకు గురి చేసేలా మాట్లాడుతున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్ర బడ్జెట్‌ తగ్గిందని, బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం ఏర్పడిందంటూ అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కూడా బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం వచ్చిందనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఇది ఆర్థిక మాంద్యం కాదని, ఆర్థిక మందగమనమని పేర్కొన్నారు. కేంద్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుందని, రాష్ట్రం పాటించడం లేదని ఆరోపించారు.  ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోందన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల వినియోగం తగ్గిందని, భారత ఆర్థిక వ్యవస్థపైనా కొంత ప్రభావం పడిందన్నారు. అందుకే వృద్ధి రేటు కొంత తగ్గిందని, వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు.

పెట్టుబడులు పెం చేందుకు అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు. మూలధనం కింద బ్యాంకులకు రూ.70 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇస్తున్నామని చెప్పారు. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచుతున్నామన్నారు. కార్పొరేట్‌ పారిశ్రామిక రంగానికి 10 శాతం పన్ను తగ్గించడం గత 20 ఏళ్లలో మొదటిసారి అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక మాం ద్యం నుంచి మన దేశాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంటేæ మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 5.6 శాతం ఉందన్నారు. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి జీడీపీ 1.9 ట్రిలియన్‌ డాలర్లు ఉంటే నాలుగేళ్లలో 2.7 ట్రిలియ న్‌ డాలర్లకు చేరుకుందన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని రకాల ప్రోత్సాహకాలకు బ్యాంకులు ఈ నగదును ఉపయోగించవచ్చని తెలిపారు. దేశ వ్యాప్తంగా సమస్యలపై పోలీసు, ఫైర్, మెడికల్, మహిళల వేధింపు లు తదితర అన్నింటిపై ఫిర్యాదు చేసేందుకు డయ ల్‌ 112 నంబర్‌ని తీసుకొస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. దానిని ఢిల్లీలో ప్రారంభించామని, ప్రయోగాత్మకంగా అక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డయల్‌ 100, 101 ఉండవన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement