నిధులున్నా.. కదలరా! | Transport facilities | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. కదలరా!

Dec 30 2015 1:09 AM | Updated on Mar 19 2019 6:19 PM

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా రంగానిదే కీలక పాత్ర. రవాణా వసతులు మెరుగ్గా ఉంటే పరిశ్రమల స్థాపనకు వెసలుబాటు,

వరంగల్ : ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా రంగానిదే కీలక పాత్ర. రవాణా వసతులు మెరుగ్గా ఉంటే పరిశ్రమల స్థాపనకు వెసలుబాటు, ఆపై స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఈ ఉద్దేశంతోనే రవాణా వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు అన్ని రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ అలసత్వం అన్ని శాఖల్లో ఉన్నా.. పంచాయతీరాజ్(పీఆర్) శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారుల తీరు మరీ అధ్వానంగా ఉంది. పెద్దమొత్తంలో నిధులు.. రోడ్ల నిర్మాణానికి కావాల్సిన అన్ని వనరులు అందుబాటులో ఉన్నా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పీఆర్ విభాగం  ోడ్లు ఉండే తొమ్మిది జిల్లాల్లో మన జిల్లా ఏడో స్థానంలో ఉండడం చూస్తేనే అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చు.

పునరుద్ధరణకు రూ.416 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ శాఖ తరఫున గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా రోడ్లు నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్)కు నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా రూ.416 కోట్ల నిధులు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలోమీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని సూచించింది. అరుుతే, ఈ పనులు ఎప్పు డో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఘనత వహించిన మన ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి కావడం లేదు. 1676.37 కిలోమీటర్లలో కేవలం 484 కిలోమీటర్ల మేర రోడ్లనే పునరుద్ధరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నూతన రోడ్లు
ఇక.. పాత రోడ్లను పునరుద్ధరించడమే కాకుండా జిల్లాలో కొత్తగా 396.83 కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం రూ.185.71 కోట్లు విడుదల చేసింది. పనుల అంచనా నివేదికలు రూపొందించడమే కాకుండా పూర్తయిన పనులకు బిల్లులు తయారు చేయడంలోనూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నూతన రోడ్ల పనుల పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లాలో ఇప్పటికి 57 కిలోమీటర్ల మేరకే కొత్త రోడ్లు నిర్మించడం గమనార్హం.

మంచి సీజన్‌లోనూ..
రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నవంబర్ నుంచి మే వరకు అనువైన సీజన్‌గా చెబుతారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో సెప్టెంబర్ నుంచే రోడ్ల పనులు చేసేందుకు అనువుగా ఉంది. అరుునా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం పనులపై దృష్టి పెట్టడం లేదు. వరంగల్ జిల్లాలో అనుభవం ఉన్న పెద్ద కాంట్రాక్టర్లే కాకుండా.. బీటీ రోడ్ల నిర్మాణంలో కీలకమైన 22 హాట్ మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. నిధులు కేటాయించి ఏడాది గడుస్తోంది. ఇలా వనరులు ఉన్నా రోడ్ల పనులు జరిగే తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఈ విషయూన్ని గుర్తించిన పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
రంగంలోకి దిగిన ఈఎన్‌సీ

 వరంగల్ జిల్లా అధికారుల తీరు వల్ల తమ శాఖకు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉందని పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేపదే చెప్పినా జిల్లా అధికారుల తీరు మారకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ అత్యున్నత అధికారి ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) ఎం.సత్యనారాయణరెడ్డి ఈనెల 23న జిల్లాకు వచ్చారు. ఇంజనీరింగ్ శాఖలోని అందరు అధికారులతో పనుల తీరుపై సమీక్షించారు. నెల రోజులుగా జిల్లాలో ఒక్క కిలోమీటరు రోడ్డు పనులైనా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని వనరులు ఉన్నా పనులపై శ్రద్ధ చూపని అధికారులు.. ఈఎన్‌సీ ఆగ్రహంతోనైనా తీరు మార్చుకుంటారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement