చిన్నారులను మింగిన పెళ్లి భోజనం

Three Children's Died With Food Poisoning In Adilabad - Sakshi

కొలాంగూడలో వికటించిన విందు భోజనం

ముగ్గురు చిన్నారులు మృతి

21 మందికి అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం

108 సకాలంలో రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు

ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు 

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నార్నూర్‌ మండలంలోని కొలాంగూడలో బుధవారం చోటు చేసుకుంది. కళ్ల ముందే పసి పిల్లల ప్రాణాలు పో తుండడంతో కొలాంగూడ ఆర్తనాదలతో ముని గితేలింది. సరైన సమయంలో 108 వాహనం రాకపోవడంతోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటన నార్నూర్‌ పీహెచ్‌సీ వైద్యం తీరు, అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది.

జరిగింది ఇది...
మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలాంగూడ(గణపతిగూడ)లో 20 కొలాం గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా పూరి గూడిసెలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. దీంతో గ్రామస్తులంతా అక్కడే భోజనం చేశారు. మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా అక్కడే భోజనం చేశారు. కాసేపటికే వివాహ విందు భోజనం తిన్న 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏడాది వయస్సు ఉన్న చింటు అక్కడికక్కడే మృతిచెందాడు.
 
స్పందించని 108 వాహనం..

చిన్నా, పెద్ద అస్వస్థతకు గురికావడంతో ఆందోళనకు గురైన గిరిజనులు సర్పంచ్‌ రామేశ్వర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. కాని వారు స్పందించకపోవడంతో ప్రైవేట్‌ ఆటోలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడే అందరికీ వైద్యం అందించేందుకు ప్రయత్నం చేశారు. కాని పీహెచ్‌సీలో డాక్టర్‌ తప్పా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. దీంతో ఉట్నూర్, రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. ఈసారి కూడా 108 వాహనం సకాలంలో రాకపోవడంతో మరో ఇద్దరు చిన్నారులు అయ్యు(06), కొడప ముత్తు(01) ఆసుపత్రిలోనే గిలగిలా కొట్టుకుని మృతిచెందారు. మరో 21 మందిని ఉట్నూర్‌ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్లారు.

గిరిజనుల ఆగ్రహం.. 
పీహెచ్‌సీలో సకాలంలో వైద్యం అందకపోవడం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108కి స మాచారం అందించినా గంటసేపు అయినా రాకపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పీహెచ్‌సీ ఆవరణంలో 108 అంబులెన్స్‌ ఉన్నా డ్రై వర్‌ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంతలోనే వేరే కేసు నిమిత్తం పీహెచ్‌సీకి వచ్చిన 108 అం బులెన్స్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో వచ్చే వరకూ మృతదేహాలను తీసుకెళ్లేది లేదని తెల్చిచెప్పారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్, గాదిగూడ ఎస్సై సుబ్బారావులు అక్కడకు చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 
గ్రామాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో.. 
విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య కొలాంగూడను సందర్శించి వివరాలు సేకరించా రు. అస్వస్థతకు గురైనా గిరిజనులకు మెరుగైనా వై ద్యం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. ఘటనపై ఆరా తీశారు. ఐటీడీఏ తరుపున అన్నిరకాల సహాయ, సహకాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలి పారు. గ్రామంలో వైద శిబిరం ఏర్పాటు చేయాల ని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ డేవిడ్, జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్‌ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top