పాఠ్యపుస్తకాలొచ్చేశాయ్‌!

Text Books Distributed To Government Schools In Nalgonda - Sakshi

జిల్లాకు అవసరం 8లక్షలు.. వచ్చింది 7.25లక్షలు

నల్లగొండ : ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటికే 90శాతానికిపైనే పుస్తకాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు అందించాల్సి ఉంది. గత సంవత్సరం కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు సగం పాఠశాలలు గడిచే వరకు కూడా రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి అలా కాకుండా పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించాలని నిర్ణయించి సరఫరా చేస్తోంది. జిల్లాలో  ప్రభుత్వ, జిల్లాపరిషత్, గురుకులాలతో పాటు ఇతర ప్రభుత్వ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తూ వస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో విద్యార్థి ఇన్‌ఫో అనే సైట్‌ ద్వారా పాఠ్యపుస్తకాల వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికి తోడు ఆయా జిల్లా విద్యాశాఖాధికారులనుంచి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని పుస్తకాలు అవసరమో నేరుగా ఉన్నతాధికారులు ఇండెంట్‌ తీసుకుంటున్నారు. వాటి ఆధారంగానే జిల్లాకు పుస్తకాలు పంపిస్తున్నారు.

అవసరం 8లక్షలు..
జిల్లాకు 8లక్షల పాఠ్యపుస్తకాలు అవస రం అని ఇండెంట్‌ పంపారు. వాటి ఆ« దారంగానే నెల రోజులుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివర కు 7.25 లక్షల పాఠ్యస్తకాలు జిల్లాకు చే రాయి. ఇంకా 75వేలు రావాల్సి ఉంది.

మాడుగులపల్లి మినహా అన్ని మండలాలకు...
జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాలన్నింటినీ జిల్లా విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు మండలాల వారీగా ఆయా ఇండెంట్‌ను బట్టి పంపిణీ చేశారు. జిల్లాలో 31 మండలాలు ఉండగా ఒక్క మాడుగులపల్లి మండలం మినహా మిగతా 30 మండలాలకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు చేర్చారు. మరో రెండు రోజుల్లో మిగిలిన పుస్తకాలు కూడా రానున్నాయి. వాటిని మాడుగులపల్లి మండలానికి పంపిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

స్కూల్‌ పాయింట్లకు పాఠ్యపుస్తకాలు
రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చిన పుస్తకాలను అధికారులు మండలాల వారీగా పంపిణీ చేశారు. అక్కడినుంచి మండల విద్యాధికారి వాటిని స్కూల్‌ పాయింట్లకు పంపిస్తున్నారు. పాఠశాలలు మొదట జూన్‌ 2 నుంచే ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మండల పాయింట్లకు చేరిన పుస్తకాలు స్కూల్‌పాయింట్లకు చేరుతున్నాయి. ఎండ తీవ్రతతో జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరుస్తామని చెప్పడంతో పాఠ్యపుస్తకాల పంపిణీకి మరింత సమయం లభించింది. దీంతో అన్ని పాఠశాలలకు పునః ప్రారంభం లోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి.

కొన్ని సబ్జెక్టులు రావాల్సి ఉంది
విద్యాశాఖ నుంచి పాఠ్యపుస్తకాలు ఇప్పటికే 90శాతం పై చిలుకు చేరాయి. వాటిల్లో 10వ తరగతి తెలుగు మీడియం సోషల్‌ టెక్టŠస్‌బుక్, 4వ తరగతి ఎన్విరాన్‌మెంట్‌ బుక్‌తో పాటు కొన్ని పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వాటిని కూడా త్వరలోనే పంపిస్తారని చెబుతున్నారు.

పక్కదారి పట్టకుండా చర్యలు
పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టే అవకాశం లేదు. విద్యార్థుల ఆధారంగానే పాఠ్యపుస్తకాలు పంపిస్తున్నారు. గతంలో పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల కంటే 10శాతం ఇండెంట్‌ ఎక్కువ పెట్టేవారు.ఉన్నతాధికారులు వాటికి చెక్‌ పెట్టారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికే పుస్తకాలు పంపిస్తున్నారు. దీనికి తోడు అచ్చయ్యే ప్రతి పుస్తకంపై ఒక క్రమసంఖ్యను ముద్రించడంతో పాటు ఫ్రీ అని ఎంబ్లమ్‌ కూడా ముద్రిస్తుండడంతో ఆ పుస్తకాలు బయట విక్రయిస్తే పట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ పుస్తకాలు బయట కనిపిస్తే ఆ బుక్‌ మీద ఉన్న నంబర్‌ ఆధారంగా అది ఏ జిల్లా బుక్కో తేలిపోనుంది.

పాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలు
పాఠశాలలు ప్రారంభం కాకముందే  పాఠ్యపుస్తకాలు చేరుతాయి. ఇప్పటికే 8లక్షల పుస్తకాలు అవసరం ఉండగా, 7.25లక్షలు వచ్చాయి. మిగిలినవి కూడా రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.  ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.   – సరోజినీదేవి, డీఈఓ నల్లగొండ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top