తెలుగు వర్సిటీది ఓ విషాద గాథ: లక్ష్మణ్‌

Telugu Varsity is a tragic story: Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు విశ్వవిద్యాలయంలో సమస్యలు తిష్ట వేశాయని, ఆ వర్సిటీది ఓ విషాద గాథ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బాచుపల్లిలో ఉన్న వర్సిటీ హాస్టల్‌ 2005లో 50 గదులతో ప్రారంభమైందని, ఇందులో మొదట్లో 100 మంది విద్యార్థులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 50కే పరిమితమైందని అన్నారు. హాస్టల్‌లో మంచినీటి వసతి లేదని, స్థానిక గ్రామ పంచాయతీనే దయతలచి రోజూ ట్యాంకర్‌ ద్వారా నీరు ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు రోజూ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని కళాశాలకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ వారికి బస్సు సౌకర్యం లేదని అన్నారు. అసలు బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలుసా..? అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు, తెలుగు భాషా వికాసం కోసం కనీసం రూ.100 కోట్లు కేటాయించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్మణ్‌ కోరారు.

మోదీ ఇమేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదని.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీని విమర్శించడం, దూషించడం ద్వారా కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి పెద్ద నాయకుడు కావాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. నైతికత గురించి రేవంత్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. కులం, మతం గురించి ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top