దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌

Telangana State Number One In India Said Harish Rao - Sakshi

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ర్యాలీ, బహిరంగ సభ

జిన్నారం(పటాన్‌చెరు): దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతున్నాయని, కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని, ఇక మెజార్టీని భారీగా అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామం నుంచి గుమ్మడిదల వరకు రోడ్‌ షో నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమైందని, 5లక్షల మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేసేలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటే కేంద్రం నుంచి అధికంగా నిధులను పొందొచ్చన్నారు.

దుండిగల్‌ నుంచి గుమ్మడిదల మీదుగా నర్సాపూర్‌ వరకు రూ.436 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషి చాలా ఉందన్నారు. కాళేశ్వరం నీటిని జిన్నారం, గుమ్మడిదల మండల ప్రాంతాల్లోని రైతులకు అందిచేలా కృషి చేస్తున్నామన్నారు. మల్లన్నసాగర్‌ కెనాల్‌ కూడా గుమ్మడిదల మీదుగా వెళ్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు గెలిసే ప్రసక్తే లేదని, వారికి ఓటేస్తే బురదలో వేసినట్లేనన్నారు. స్థానికంగా గెలవలేరని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎంపీ రేసులో ఉండటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్, నాయకులు చంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, కుమార్‌గౌడ్, బాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top