టీచర్లు కావాలె! | Students Wants Teachers In Nagarkurnool District | Sakshi
Sakshi News home page

టీచర్లు కావాలె!

Jun 22 2019 12:29 PM | Updated on Jun 22 2019 12:31 PM

Students Wants Teachers In Nagarkurnool District - Sakshi

ఆకునెల్లికుదురు పాఠశాల భవనం

సాక్షి, తాడూరు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా చదువు చెప్పే పంతుళ్లు కరువయ్యారు.. మండలంలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యావలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు.. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.  

మండలంలో ఇలా 
మండలంలో చాలావరకు ఉపాధ్యాయులున్న చోట పిల్లలు లేరు, పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు. మండలంలోని ఆకునెల్లికుదురులో ఐదు తరగతులకు గాను 50మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. రెండు ఉపాధ్యాయ పోస్టులకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్న ఒక్క ఉపాధ్యాయులు విద్యపరమైర సెలవుపై వెళ్లడతో వలంటీరుతో చదువు కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో వలంటీరుతో చదువు ఎలా సాగుతుందన్న ఉద్దేశంతో గ్రామస్తులు తమ పిల్లలను మెరుగైన విద్య కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయినా ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు.

దీంతో ఉన్న వలంటీరుతో చదువు సాగడం కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు 20మందికి పైగా విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు. మండలంలో 24ప్రాథమికపాఠశాలలు, ఏడుప్రాథమికోన్నత, ఆరు ఉన్నత, ఒక కేజీబీవీ పాఠశాల ఉంది. పాఠశాలలో 1,856 మంది బాలురు, 2,304మంది బాలికలతో మొత్తం 3,890 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 565 మంది కొత్తగా పాఠశాలలో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వంద ఉపాధ్యాయ పోస్టులకుగాను 88మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 13ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు లేక కొమ్ముకుంట తండా పాఠశాల మూసివేశారు.

పలు గ్రామాల్లోని పాఠశాలలో అదనపు నగదుల కొరత మరి కొన్ని గ్రామాలలో శిథిలావస్థకు చేరిన భవనాలు, అరకొర వసతుల మధ్య పాఠశాలలు కొనసాగుతున్నాయి. విధిగా బోధించి ఉత్తమ ఫలితాలు తేవాలన్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారి సరిపడా వసతులు లేకపోవడం వల్ల చదువులు డీలా పడుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఉమ్మడి జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించే తాడూరు  మండల పరిస్థితిని మెరుగుపర్చే విధంగా కృషి  చేయాలని ప్రజలు కోరుతున్నారు.   

సమస్యలు పరిష్కరిస్తాం 
మొత్తం 13ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వలంటీర్లను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా చదువుకు ఆటంకం లేకుండ చూస్తాం. ఆకునెల్లికుదురు గ్రామానికి తాత్కాలికంగా ఉపాధ్కాయుడిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంది.  
– డా.చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ  

Advertisement
 
Advertisement
Advertisement