స్త్రీనిధి.. రూ.45 కోట్లు  | Sreenidhi Scheme in Telangana | Sakshi
Sakshi News home page

స్త్రీనిధి.. రూ.45 కోట్లు 

Apr 30 2018 4:35 PM | Updated on Apr 30 2018 4:35 PM

Sreenidhi Scheme in Telangana - Sakshi

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికలను సిద్ధం చేసింది.

చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలోని 18,121 మహిళా సంఘాలకు రూ. 45 కోట్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వార్షిక ప్రణాళిక రూపొందించారు. 2017–18లో రుణ లక్ష్యం రూ.25.14 కోట్లు పెట్టుకోగా, మహిళా సంఘాలకు రూ.32.35 కోట్లు పంపిణీ చేశారు. లక్ష్యానికి మించి రూ.7.21 కోట్లు అధికంగా రుణాలు ఇచ్చారు. సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రతి ఏటా  ఇస్తున్న స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లాలోని 18,121 మహిళా సంఘాల్లో 1,64,867 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం కలగనుంది.  

ఈ ఏడాది రూ.20 కోట్లు పెరిగిన లక్ష్యం 
మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాల లక్ష్యం పెరుగుతోంది. స్త్రీనిధి ద్వారా కేవలం రుణ అర్హత సాధించిన సంఘాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 2016–17లో మహిళా సంఘాలకు రూ.19.52 కోట్ల రుణం లక్ష్యం పెట్టుకోగా  రూ.16.95 కోట్లను అందజేశారు. 3,479 సంఘాలకు అందజేసి లక్ష్యంలో 86.84 శాతం నమోదు చేశారు. 2017–18లో రూ.25.14 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా, రూ.32.35 కోట్లను అందించారు. 5,779 గ్రూపులకు రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి 128 శాతం నమోదు చేశారు. ఇక 2018–19లో గతేడాది కంటే రూ.20 కోట్లు అధికంగా రూ.45 కోట్లు అందించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మైక్రో, జనరల్, టైనీ రుణాల రూపంలో రూ.1.25 కోట్లను 312 గ్రూపులకు చెల్లించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీకి అధికారులు ఇప్పటికే చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement