తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా జిల్లాకు చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారికి అవకాశం లభించనుంది. సోమవారం నుంచి శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.
- జిల్లాకు తొలి అవకాశం.. సన్నిహితుడి వైపే కేసీఆర్ మొగ్గు
- ఇప్పటికే డిప్యూటీ సీఎంగా తాటికొండ
- మరో మంత్రి పదవిపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ
వరంగల్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా జిల్లాకు చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారికి అవకాశం లభించనుంది. సోమవారం నుంచి శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్పీకర్ ఎంపికను ఏకగ్రీవం చేసేందుకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్రావు విపక్షాలతో చర్చిస్తున్నారు.
స్పీకర్ ఎన్నిక నేడో, రేపో జరుగుతుందని, నూతన సభ్యుల ప్రమాణస్వీకారానికి పట్టే సమయాన్ని బట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. సిరికొండ మధుసూదనాచారి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా విశేష సేవలందించి ఎన్టీఆర్ మనసు చూరగొన్నారు.
1994 ఎన్నికలకు ముందే అప్పటి శాయంపేట నియోజకవర్గ అభ్యర్థిగా చారిని ఎన్టీఆర్ ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 1994లో టీడీపీ అభ్యర్థిగా మధుసూదనాచారి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగిడారు. అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీని వీడి టీఆర్ఎస్ వ్యవస్థాపక సమయంలోనే అందులో చేరారు. అప్పటినుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా ఆయనతో కలిసి సాగుతున్నారు.
రాష్ట్ర కార్యాలయ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలైనప్పటికీ... తాజా ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్కు చెందిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపై విజ యం సాధించారు. మంత్రి పదవి ఆశించినప్పటికీ కేసీఆర్ ఆయనను స్పీకర్గా పనిచేయాలని ఒప్పించినట్లు తెలుస్తోంది. అధినే త ఆదేశాలతో స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిం చేందుకు సిరికొండ సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచర వర్గాలు భావిస్తున్నాయి.
సిరికొండ ఉన్నత విద్యావంతుడు, శాసనసభా వ్యవహారాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన సిరి కొండ స్పీకర్ బాధ్యతల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టగలరనే విశ్వాసంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. సిరికొండ స్పీకర్ ఎంపిక లాంఛనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనూహ్య పరిణామాలు ఎదురై చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప సిరికొండ నే తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్గా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది.
మరో మంత్రి పదవి ఇస్తారా.. లేదా..
తొలి కేబినేట్లో జిల్లాకు చెందిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. స్పీకర్గా సిరికొండకు అవకాశం లభిస్తే, విప్ పదవుల్లో ఒకటి జిల్లాను వరించే అవకాశం ఉంది. శాసనసభా సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో జిల్లాలో మరొకరికి చోటు కల్పిస్తారనే విశ్వాసంతో ఉన్నారు. దీనిపై సీనియర్ ఎమ్మెల్యేలు ఆశతో ఉన్నారు. డిప్యూటీ సీఎం జిల్లాకు చెందిన వ్యక్తికే ఇవ్వడం వల్ల మరో మంత్రి పదవి ఇస్తారా.. లేదా.. అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.