ప్రచారంలో సౌండ్ పెంచితే కేసులే...
సాక్షి, బయ్యారం(ఇల్లందు): ఎన్నికలు వచ్చాయంటే చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారంతో మైకులు హోరెత్తుతుంటాయి. తమకే ఓటు వేయాలని పల్లెల నుంచి పట్టణాల వరకు మైకులతో ప్రచారం కొనసాగిస్తుంటారు. విపరీతమైన శబ్దాలను పెట్టడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండటంతో ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలను పెట్టినట్లయితే సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేయటంతో పాటు జరిమాన విధిస్తారు. నివాసప్రాంతాల్లో 45–55 డెసిబుల్స్, వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల ప్రాంతాల్లో 40–50 డెసిబుల్స్, వ్యాపారప్రాంతాల్లో 55–65 డెసిబుల్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 70–75 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తారు.