తెలంగాణకు వేరుగా కౌన్సెలింగ్! | Separate Eamcet notification for Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు వేరుగా కౌన్సెలింగ్!

Aug 7 2014 1:50 AM | Updated on Sep 2 2017 11:28 AM

ఎంసెట్ ప్రవేశాలకు సొంతంగానే కౌన్సెలింగ్ నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

* ఎంసెట్ ప్రవేశాలకు విడిగా నోటిఫికేషన్ జారీ యోచనలో టీ సర్కారు

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాలకు సొంతంగానే కౌన్సెలింగ్ నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. సొంతంగా ప్రవేశాలు చేపట్టేందుకు వీలయ్యే అంశాలపై పరిశీలిస్తోంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై కోర్టు కాపీ ఇంకా రానందున, అధికారిక నిర్ణయం జరగనందున తమ తుది నిర్ణయాన్ని తేలనట్లు సమాచారం. 10వ తేదీ నాటికి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందని ఏపీ ఉన్నత విద్యామండలి చెప్పినా... విడిగా ప్రవేశాలు చేపట్టేందుకు ఏం చేయాలనే అంశంపైనే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

ఇక్కడ 10వ తేదీ నాటికి సర్టిఫికెట్ల తనిఖీ ప్రారంభించినా... తెలంగాణకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.పదో తేదీన పండుగ కావడంతో.. వెరిఫికేషన్‌కు అవకాశం ఎలాగూ ఉండదు. 11న సుప్రీంలో తుది తీర్పు రానుండటంతో... ఆ రోజు తమ వాదనలు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం పకడ్బందీగా సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతోపాటు మండలి ఏర్పాటు, చైర్మన్ నియామకం, సర్టిఫికెట్ల తనిఖీ, కౌన్సెలింగ్ నిర్వహణ స్థితిగతులు వంటి అంశాలపై బుధవారం పొద్దంతా సీఎం, అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు.

బుధవారం ఉదయమే సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ మండలి చైర్మన్ పాపిరెడ్డి సమావేశమయ్యారు. ఆ తరువాత ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్య కమిషనర్ శైలజారామయ్యర్ పాల్గొన్నారు. అనంతరం ఎంసెట్ వ్యవహరంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద జరిగిన సమావేశంలో వికాస్‌రాజ్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement