
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ హీరో నాగార్జున సోదరి నాగసుశీలను నమ్మించి భారీ మొత్తంలో మోసగించారనే అభియోగంపై చింతలపూడి శ్రీనివాసరావుతో పాటు మరో 12 మందిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్లో నివసించే నాగసుశీలను 2005లో కలిసిన శ్రీనివాసరావు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలు వస్తాయని వివరించారు.
ఆయన మాటలు నమ్మిన నాగసుశీల.. ఒప్పందం చేసుకుని 2005 జూలై 28న ఎస్ఎస్ అసోసియేట్స్ పేరుతో కంపెనీ రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి మేనేజింగ్ పార్టనర్గా ఉన్న శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా చిన్నమంగళారంలో 34 ఎకరాల 28 గుంటల భూమి కొనుగోలు చేశాడు. అతడి మాటలను నమ్మిన నాగసుశీల శ్రీనాగ్ రియల్ ఎస్టేట్స్, శ్రీనాగ్ కార్పొరేషన్, ఎస్ఆర్ ప్రాపర్టీస్ సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. చిన్నమంగళారంలో శ్రీనాగ్ ఎస్టేట్స్ పేరు మీద 6 ఎకరాల 16 గుంటలు, విజయనగరం జిల్లా రాజాపులోవా గ్రామంలో 12 ఎకరాల 33 గుంటలు, మరో 23 ఎకరాల 67 గుంటలు, చిత్తూరు జిల్లా కుర్కాల గ్రామంలో 45 గుంటలు ఎస్ఆర్ ప్రాపర్టీస్ పేరు మీద కొనుగోలు చేశారు.
ఇందుకోసం నాగసుశీల రూ.కోటితోపాటు ఎస్ఆర్ ప్రాపర్టీస్లో పెట్టుబడుల కోసం రూ.65 లక్షలకు ఆరు చెక్కులను శ్రీనివాసరావుకు ఇచ్చారు. శ్రీనివాసరావు తన భార్య సునీతతో కలసి ఎస్ఆర్ ప్రమోటర్స్ను రిజిస్టర్ చేసి ఎస్ఆర్ ప్రాపర్టీస్లో భాగస్వాములుగా ఉన్నట్టు సృష్టించారు. రాజాపులోవాలోని 23 ఎకరాల 67 గుంటలను మోసపూరితంగా ఎస్ఆర్ ప్రమోటర్స్ పేరిట రిజిస్టర్ చేశాడు.
ఎన్నిసార్లు అడిగినా వాయిదాలే..
హైదరాబాద్, విశాఖలో ఉన్న భూముల వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు వెల్లడించాలంటూ ఎన్నిసార్లు నాగసుశీల అడిగినా శ్రీనివాసరావు వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ తర్వాత భాగస్వామ్య డీడ్స్ చూస్తే శ్రీనివాసరావు, సునీతలు భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించారు. విచారణ చేస్తే ఎస్ఆర్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన భూముల పక్కనే ఎస్ఆర్ ప్రమోటర్స్ కూడా కొనుగోలు చేసిందని తేలింది. నాగసుశీల ఇచ్చిన డబ్బులనే ఎస్ఆర్ ప్రమోటర్స్లో వాడారు.
రాజాపులోవాలో 40 గుంటలలో పెట్టుబడుల కోసం రూ.12 కోట్లు వినియోగించాలంటూ శ్రీనివాసరావుకు నాగసుశీల అనుమతి ఇచ్చారు. అయితే ఆ భూమిని ఎస్ఆర్ ప్రమోటర్స్ పేరిట సేల్డీడ్ చేశారు. భార్యాభర్తలు కలసి తనను మోసం చేశారని అక్టోబర్ 14న నాగసుశీల ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులు అక్టోబర్ 14న శ్రీనివాసరావు, సునీతతోపాటు 12 మందిపై ఐపీసీ 403, 406, 409, 420, 477(ఎ), 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కుమారుడి కోసం కోట్లు పెట్టించారు..
నాగసుశీల కుమారుడిని హీరోగా ప్రమోట్ చేసేం దుకు శ్రీనివాసరావుతో సినిమాల్లో పెట్టుబడులు పెట్టించారని, అలా తీసిన నాలుగు సినిమాలు సరిగా ఆడకపోవడంతో రూ.40 కోట్ల నష్టం వచ్చిందని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది లక్ష్మీకుమారి చెప్పారు. సినిమాల్లో నష్టాలు వస్తున్నాయని శ్రీనివాసరావు నిలదీయడంతో అప్పటి నుంచి వారికి వ్యాపార విషయాల్లో తరచూ వివాదాలు మొదలయ్యాయన్నారు. నాగసుశీల సోదరుడు నాగార్జున కలుగజేసుకుని మధ్యవర్తి మహేశ్రెడ్డి వద్ద పరిష్కరించుకోవాలని సూచించారని, 20 సార్లు కూర్చొని మాట్లాడగా శ్రీనివాసరావుకు రూ.60 కోట్లు వెళతాయంటూ మహేశ్రెడ్డి తేల్చారని చెప్పారు.
అయినా మూడు సంస్థల వ్యాపారం కోసం శ్రీనివాసరావు బయట నుంచి తీసుకొచ్చిన రూ.60 కోట్లు, సినిమాల్లో వచ్చిన రూ.40 కోట్ల నష్టం శ్రీనివాసరావే భరించాలంటూ నాగసుశీల ఒత్తిడి తెచ్చారని, శ్రీనివాసరావు, అతని భార్య పేరు మీద ఉన్న ఎస్ఆర్ ప్రమోటర్స్లో 40 శాతం వాటా ఇవ్వాలని ఒత్తిడి తేవడమే కాక బెదిరించారని ఆరోపించారు. నాగసుశీల ఫిర్యాదుపై పోలీసులు ఎలా కేసు నమోదు చేశారో తెలియడం లేదని, ముందస్తు బెయిల్ కోసం తాము కోర్టుకు వెళ్లామని, అయితే కోర్టును తప్పుదారి పట్టించేలా నాగసుశీల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు.