ప్లాస్టిక్‌..ఏదీ ‘లాక్‌’? | Plastic Usage Increased In Telangana | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌..ఏదీ ‘లాక్‌’?

May 24 2020 4:28 AM | Updated on May 24 2020 4:28 AM

Plastic Usage Increased In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వినియోగం ఒక్కసారి గా పెరిగింది. ముఖ్యంగా ఒక్కసారి వాడి పారేసే క్యారీబాగులు (సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌), యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్ల వినియోగం.. ఈ 2 నెలల లాక్‌డౌన్‌ కాలంలో బాగా పెరగడంపై పర్యావరణవేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరా లు, పండ్లు, కూరగాయలు, మందులు, ఇతర వస్తువుల్ని సులభంగా తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్‌ కవర్లు, ప్రధానంగా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్ల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.

నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం, ఉత్పత్తిని నియంత్రించడం, నిఘా ఉంచడం వంటివన్నీ జీహెచ్‌ఎంసీ చేయాల్సి ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. 50 మైక్రాన్ల కం టే తక్కువ పలుచగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర రూపాల్లోని వస్తువుల వినియోగంపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. రాష్ట్రంలో వీటిని ఉత్పత్తి చేసే యూనిట్లను గుర్తించాలని మున్సిపల్‌ శాఖను కొంతకాలం క్రితం ప్రభు త్వం ఆదేశించింది. మున్సిపల్‌ అధికారులు మాత్రం తమ వద్ద తగిన మౌలిక సదుపాయాలు లేవని అంటున్నారు.  

కమిటీ అధ్యయనం ఏమైంది? 
రాష్ట్రంలో ఒక్కసారి ఉపయోగించి పారేసే వస్తువులపై నిషేధం విధింపుపై అధ్యయనానికి వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఈ నిషేధం ఎలా అమలవుతోంది?, ఈ ప్లాస్టిక్‌ వినియోగానికి ప్రత్యామాయంగా ఏ రకమైన వస్తువులు రూపొందించాలి?, వాటి తయారీకి ఎలాంటి ముడిసరుకు వాడాలి?, వాటిని ఉత్పత్తిచేసే పరిశ్రమల ప్రోత్సాహానికి చేపట్టాల్సిన చర్యలేమిటి? అనేది ఈ కమిటీ పరిశీలించి సూచనలు చేయాల్సి ఉంది. అయితే, కమిటీ ఏర్పాటై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టలేదు.

Advertisement
 
Advertisement
Advertisement