రెవెన్యూ రిక‘వర్రీ’! | old debt issues to the Taxes department | Sakshi
Sakshi News home page

రెవెన్యూ రిక‘వర్రీ’!

Oct 18 2017 3:12 AM | Updated on Oct 18 2017 3:12 AM

old debt issues to the Taxes department

సాక్షి, హైదరాబాద్‌: పేరుకుపోయిన బకాయిలు రాబట్టుకోవడం పన్నుల శాఖకు పెద్ద సమస్యగా మారింది. నోటీసులిచ్చినా, చివరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద తాఖీదులు జారీ చేసినా డీలర్ల నుంచి స్పందన లేకపోవడం, జీఎస్టీ అమలు నేపథ్యంలో డీలర్ల పట్ల పన్నుల శాఖ సిబ్బంది మెతక వైఖరి కారణంగా ఈ బకాయిలు ఇప్పట్లో వసూలయ్యేలా కనిపించట్లేదు. రూ.322 కోట్లకు పైగా పన్ను బకాయిల కోసం ఆర్‌ఆర్‌ చట్టం కింద నోటీసులు జారీ చేసి 4 నెలలవుతున్నా ఫలితం లేకపోవడం గమనార్హం.

లొసుగులే ఆసరాగా..
మొండి బకాయిలు రాబట్టుకునేందుకు పన్నుల శాఖ ప్రయోగించే చివరి అస్త్రం రెవెన్యూ రికవరీ చట్టం. ఈ చట్టం కింద నోటీసులు జారీ చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి సదరు డీలర్‌ బ్యాంక్‌ అకౌంట్‌ అటాచ్‌ చేసుకోవడం, అవసర మైతే స్థిర, చరాస్తుల వేలం ద్వారా పన్నులను రాబట్టుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ  చట్టంలోని లోసుగుల ఆధారంగా డీలర్లు కోర్టులకు వెళుతుండటం, అసెస్‌మెంట్లలో తప్పులున్నాయంటూ నోటీసులకు సమాధానా లిచ్చి కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారు.

జీఎస్టీ రాకతో పెండింగ్‌లోకి..
జీఎస్టీ రాకతో మొండి బకాయిల ఫైల్‌ పెండిం గ్‌లో పడిపోయింది. జూన్‌ నుంచి జీఎస్టీ అమలు చేయడంలో మునిగిపోయిన అధికారులు బకాయిలపై దృష్టి సారించలేదు. ఆగస్టు తర్వాత ఉన్న తాధికారులు బకాయిల వసూలుకు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయినా క్షేత్ర స్థాయిలో స్పందన లేకపోవడంతో పాత బకాయి లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దంటూ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ అమలు వల్ల డీలర్లను, అధికారులను సాంకేతిక సమస్యలు వేధిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆ పనిపై దృష్టి సారించలేక పోతున్నామని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement