హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని ఆయన బుధవారం శాసనమండలిలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ వెల్లడించారు. గ్రామాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కుల వృత్తులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఇక తెలంగాణ ఐ పాస్ను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. విద్యుత్ శాఖలో 24 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగి అనేది లేకుండా చూస్తామన్నారు. హోంగార్డులందరికి కానిస్టేబుల్స్గా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ బిల్లు తెస్తామని కేసీఆర్ తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మీ పథకానికి కేటాయింపులను రూ.75,116కి పెంచామన్నారు.
►అప్పులు చెల్లించినా కొద్దీ తిరిగి అప్పుల లభిస్తాయి. దివాలా తీసిన వారికి అప్పులు ఇవ్వరు.
►మన రాష్ట్రంలో కూడా విద్యుత్ సంస్థలు ఉదయ్ పథకం కింద 12 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాం.
►ప్రత్యేక సమర్థతను ప్రతిపక్షాలు గుర్తించక పోయినా... ప్రజలు గుర్తిస్తున్నారు.
►ప్రతిపక్షాలు అక్కసుతో, నిందాపూర్వకంగా కాకుండా నిర్మాణాత్మకంగా విమర్శలు చేయవచ్చు.
►విద్యుత్ మిగులు దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఏడాది గడిస్తే... మిషన్ భగీరథ పూర్తైతే.. రాష్ట్రంలో మంచినీటి సమస్య పూర్తిగా కనుమరుగవుతుంది.
►ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయడం ద్వారా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఆపేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు.
►ఈ కేసులు స్పీడ్ బ్రేకర్లు మాత్రమే... పూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ అడ్డుకోలేదు.
►రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, కోటి ఎకరాలకు నీరందిస్తాం.
►సమాజంలో దళిత, బీసీవర్గాల జనాభానే 90శాతం. అగ్రవర్ణాల 9.5శాతం మాత్రమే.
►దేశంలోనే 21శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
►నోట్లరద్దు జరిగినా మోటార్ వాహనాల రంగంలో మినహా... మిగతారంగాల్లో వృద్ధి రేటు తగ్గలేదు.
►ఐటీ ఎగుమతులు 75వేల కోట్లు దాటింది.
►తెలంగాణలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి. ప్రకృతిలో ఇవి అన్నిటికంటే గొప్ప సంపద.
►రెండేళ్లలో రాష్ట్రంలో 4లక్షల యాదవ కుటుంబాలకు 88 లక్షల గొర్రెలు అందిస్తాం.
►రెండేళ్లలో 4.5 కోట్ల గొర్రెల ఉత్పత్తి పెరుగుతుంది.
►యూనిట్ కు 21 గొర్రెలు పంపిణీ చేస్తాం.
►5వేలకు ఒక గొర్రెను అమ్ముకున్నా... 20వేల కోట్ల రూపాయల సంపద పెరుగుతుంది.
►7రాష్ట్రాల్లో పర్యటించి గొర్రెల కొనుగోలుకు కలెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
►రాష్ట్రంలో 60ఏళ్లలో గత ప్రభుత్వాలు 19 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే... మేం రెండేళ్లలో 190 బీసీ పాఠశాలలు ఏర్పాటు చేశాం.
►201మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం.
►ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 100 శాతం రాజకీయ అవినీతి రూపుమాపాం.
►తప్పుడు ఆరోపణలు చేస్తే... కేసులు పెట్టేందుకు పటిష్టమైన చట్టం తేబోతున్నాం.
►ఎల్ అండ్ టీ ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గకుండా... విద్యుత్ రంగంలో బీహెచ్ ఇఎల్ కు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పనులు అప్పగించాం.
►మా ప్రభుత్వంలో కుంభకోణాలు లేవు. ఒక్క అవినీతి ఆరోపణ రుజువు చేసినా రాజీనామా చేస్తానన్న మాట చెప్పాను.
►టీఎస్ ఐపాస్ ద్వారా 15రోజుల ప్రాతిపదికన 3వేల 500 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం.
►పరిశ్రమలు పెడుతున్న వారే మాకు బ్రాండ్ అంబాసిడర్లు. ఈ సంస్థలు 43వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి.
►కిందిస్థాయిలో నైనా సరే... ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం.
►36వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం.
►ఒంటరి మహిళలకు కూడా వెయ్యి రూపాయల పింఛను ఇవ్వబోతున్నాం.
►ఇప్పటికీ కొందరు దరిద్రులు అంటరానితనం పాటిస్తున్నారు.
►వారి కష్టాలు తొలగించేందుకు కళాశాల స్థాయిలో దళిత విద్యార్థినులకు వసతిగృహాలు నిర్మించబోతున్నాం.
►చేనేత కార్మికులకు 50శాతం రాయితీపై నూలు, రసాయనాలు అందించబోతున్నాం.
►కనీసం 15వేల రూపాయల వేతనం అందించే ఏర్పాటు చేస్తున్నాం.
►చేనేత కార్మికుల ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
►30వేల క్షౌరశాలలకు 1లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం.
►రజకులకు అధునాతన పరికరాలు, లాండ్రీలు ఏర్పాటు చేస్తాం
►95శాతం గుడుంబా నియంత్రించాం
►బతుకమ్మకు 34లక్షల మందికి బట్టలు పంపిణీ చేస్తాం.
►ఎంబీసీ కులాలకు వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం.
►ఎస్సీ, ఎస్టీ స్థానంలో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ బిల్లు పెట్టబోతున్నాం.
►ఎస్సీ, ఎస్టీ లతోపాటు ముస్లింలకు విదేశీ విద్యకు నిధులు అందిస్తాం.
►ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లు నేనే ప్రవేశ పెడుతా.
►ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు.
►రాష్టంలో 21లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ల సామర్థ్యం అందుబాటులో ఉంది.
►రైతులకు విత్తనాలకు, పంట నిల్వకు సమస్య లేదు.
►హైవేల నిర్మాణంలో జాతీయ సగటును మించిపోయాం
►తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండొద్దన్నది మా ఉద్దేశం.
►24వేల మంది విద్యుత్, 23వేల మంది హోంగార్డులను క్రమబద్దీకరిస్తాం.
►108 కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్దీకరిస్తాం.
►546కోట్ల రూపాయలు బస్ పాసుల రుసుం ప్రభుత్వం చెల్లిస్తుంది.
►వచ్చే ఏడాది పాలమూరు జిల్లాలో 805లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
►1లక్ష 49వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించాలని కోరుతున్నాం.
►కాంగ్రెస్ పార్టీ రెండు రకాలుగా వ్యవహరిస్తోంది.
►కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించేందుకు కాంగ్రెస్ నేతలు వేసిన కేసులు అవరోధంగా ఉన్నాయి.
►వాటిని ఉపసంహరించాలని షబ్బీర్ అలీని కోరుతున్నాం.
►కోర్టు స్టేల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరుతున్నాం.