పనుల్లో నిబంధనలు పాటించాలి | mission bhagiratha works should be as per conditions | Sakshi
Sakshi News home page

పనుల్లో నిబంధనలు పాటించాలి

Feb 1 2018 3:41 PM | Updated on Feb 1 2018 3:41 PM

mission bhagiratha works should be as per conditions - Sakshi

తక్కళ్లపల్లిలో మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే 

జగిత్యాల రూరల్‌ : మిషన్‌ భగీరథ పనులు నిబంధనలు పాటించి నిర్వహించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల మండలం ధరూర్‌ గ్రామంలో రూ. కోటి 26 లక్షలతో లక్ష లీటర్ల సామర్థ్యంతో నిర్మించే వాటర్‌ట్యాంక్‌ పైప్‌లైన్‌ పనులను ప్రారంభించారు. అలాగే కన్నాపూర్‌ గ్రామంలో రూ.3 లక్షలతో నిర్మించే బుడిగజంగాల సామూహిక భవన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనుల వల్ల గ్రామాల్లో తారురోడ్లు, సీసీరోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. పనులు కాగానే మరమ్మతులు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్తున్నారని, దీంతో గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు ముందుగానే మరమ్మతు పనులకు గ్రామపంచాయతీల్లో డిపాజిట్‌ చేసి పనులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసం కాకుండా స్థానిక నాయకులను సంప్రదించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అవగాహన లేకుండా నిర్మాణ పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఉన్న పైప్‌లైన్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథ పనుల నిర్వహణ బాధ్యత ఐదేళ్లపాటు కాంట్రాక్టర్లదేనన్నారు. జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి, సర్పంచులు కొలుగూరి జలజ, సిరిగిరి తిరుపతి, ఎంపీటీసీలు శీలం సురేందర్, గాలిపల్లి శేఖర్, నాయకులు కొలుగూరి దామోదర్‌రావు, శీలం మల్లేశం, పెండెం రాములు, సతీశ్‌ పాల్గొన్నారు.


ఎమ్మెల్యే ఆగ్రహం


మిషన్‌ భగీరథ నిర్వహణ పనులపై బుధవారం తక్కళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ నీటి సరఫరా పైప్‌లైన్లు మిషన్‌ భగీరథ పనుల్లో ధ్వంసం కావడంతో ఐదు రోజులుగా తాగునీరు అందకపోవడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పనులను ఆయన పరిశీలించారు. మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడుతూ స్థానికులను సంప్రదించి పనులు చేయాలని, ప్రస్తుతం గ్రామస్తులకు పైపుల మరమ్మతులతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో నిర్మాణం చేసే గ్రామాల్లో తాగునీటి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా పనులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం దశరథరెడ్డి, గంగాధర్, మల్లారెడ్డి, సతీశ్‌ ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement