పోరుబాట..

Medical Department employees protesting - Sakshi

ఆందోళన బాటపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు

మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాలు

27న డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం ఎదుట ధర్నా

సూర్యాపేట : వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు, రెండో ఏఎన్‌ఎంలు, ఆర్‌బీఎస్‌కే, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 104 ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదిరోజులనుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు పోస్టుకార్డుల ద్వారా ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఉత్తరాలు, నిరసనలు, ధర్నాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,168 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 45 శాతం వేయిటేజీ మార్కులు కల్పించి రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులరు భర్తీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్‌ నందు గత ప్రభుత్వాలు అమలు చేసిన పీఆర్సీ బేసిక్‌ పే విధానాన్ని,హెల్త్‌కార్డులు ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే లోపభూయిష్టమైన ప్రభుత్వ జీఓ నం:16ను వెంటనే పునరుద్ధరించి.. 2006 సంవత్సరంలో జస్టిస్‌ ఉమాదేవి ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారు.

ఈనెల 27న ధర్నా..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈనెల 27వ తేదీన  పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం ఎదుట పబ్లిక్‌ హెల్త్, మెడికల్‌ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. ధర్నాకు అన్ని జిల్లాల్లోని ఉద్యోగులు తరలిరావాలని ఇప్పటికే యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు.

ప్రజా సంఘాల మద్దతు
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఐఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్‌కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, జేఏసీ నాయకులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జీఓ నంబర్‌16ను పునరుద్ధరించాలి
అస్పష్టమైన జీఓ నంబర్‌16ను పునరుద్ధరించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి. గత ప్రభుత్వం అమలు చేసిన రెగ్యులర్‌ ఉద్యోగ నియామకాల్లో 45 శాతం మార్కులు ఇచ్చి రెగ్యులర్‌ చేయాలి.
-ఆర్‌.మనోజ్‌కుమార్‌రెడ్డి, కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌ సూర్యాపేట

పీఆర్సీ అమలు చేయాలి
గత ప్రçభుత్వాలు అమలు చేసిన విధంగానే రెండో ఏఎన్‌ఎంలకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఖాళీగా ఉన్న రెగ్యులర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -మద్దిరెడ్డి భవాని, రెండో ఏఎన్‌ఎం, కోదాడ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top