జోరుగా మాస్‌ కాపీయింగ్‌

mass copying in inter practical exams - Sakshi

జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ఇప్పటికే ఇద్దరు ఎగ్జామినర్లను విధులనుంచి తొలగించిన అధికారులు

భువనగిరి : జిల్లాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రాక్టికల్స్‌ నిర్వహించాల్సి ఉండగా కొందరూ ఎగ్జామినర్లు మందులు, విందులు స్వీకరిస్తూ మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న ఇ ద్దరు ఎగ్జామినర్లను అధికారులు తొలగించారు. దీనిని బట్టి జిల్లాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో మాస్‌ కాపీయింగ్‌ ఏవిధంగా జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు.

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్‌
జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేది నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభమయ్యాయి. 34 పరీక్ష కేంద్రాల్లో నాలుగు విడుతల్లో ఈ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తున్నారు. మొదటి విడుత 1వ తేది నుంచి 5, రెండో విడుత 6 నుంచి 10, మూడో విడుత 11 నుంచి 16, నా లుగో విడుత 17నుంచి 21వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 3,010 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ 1,421, బైపీసీ 1,589మంది విద్యార్థులు ఉ న్నారు. ఒకేషనల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు 1,313మంది విద్యార్థులు ఉన్నారు.

పర్యవేక్షణ ఏదీ..?
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పర్యవేక్షణ లేక మాస్‌కాపీయింగ్‌ జరుగుతోంది. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను నియమించారు. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి ఆయా కోర్సులను బట్టి నిర్ణిత ల్యాబ్‌ ఫీజు కంటే అదనంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కళాశాల యాజమాన్యాలు వసూలు చేశారు. దీంతో ఆయా కళా శాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్‌ కోసం వచ్చే ఎగ్జామినర్లకు మందు, విందు, తాయిలాల సౌకర్యాలు కల్పిస్తూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు మాత్రమే సీసీ కెమెరాల ఎదుట ప్రశ్నాపత్రం తీసినప్పటికీ పరీక్ష గదిలో మాత్రం మాస్‌కాపీయింగ్‌  జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మాస్‌ కాపీయింగ్‌ మా దృష్టికి రాలేదు
మాస్‌కాపీయింగ్‌ జరుగుతున్నట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేస్తున్నాం. ఆలేరులో విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించాం. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  – రవీంద్రప్రసాద్, డీఐఈఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top