నేడు జేబీఎస్–ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం
ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గంలో (11 కి.మీ) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నేడు మెట్రో రైళ్లు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద ఏర్పాటు చేయనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్ నగరంలో 69 కి.మీ మెట్రోమార్గం అందుబాటులోకి వచ్చింది.
నేడు ప్రారంభం కానున్న మెట్రోరైలు మార్గంలో జేబీఎస్ – పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ రూట్లో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాల సమయం పట్టనుంది. నిత్యం సుమారు లక్షమంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఎల్బీనగర్– మియాపూర్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తంగా ఈ మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని మెట్రో అధికారులు అంచనా వేసినప్పటికీ లక్ష్యం చేరుకోలేకపోవడం గమనార్హం.