రాజధానికి ఐపీఎల్‌ ఫీవర్‌

IPL fever in Hyderabad - Sakshi

నేడు తుది మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాది మంది యత్నం

ఐపీఎల్‌ నిర్వాహకుల తీరుతో  టికెట్లు దొరకక నిరాశ 

తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఇప్పటికే 25 వేల మంది రాక 

ఉప్పల్‌ స్టేడియంలోని మొత్తం సీట్లు 39,450 

వీటిలో 35 వేల సీట్లు బ్లాక్‌ చేసిన ముంబై, చెన్నై జట్లు 

సామాన్యులకు అందుబాటులో ఉన్నది 2 వేల టికెట్లు మాత్రమే 

సాక్షి హైదరాబాద్‌: రాజధానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్‌ తుది మ్యాచ్‌ను వీక్షించేందుకు టిక్కెట్ల కోసం ప్రయత్నించిన వేలాది మంది హైదరాబాదీలకు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య ఆదివారం రాత్రి ఇక్కడ ఫైనల్‌ పోరు సాగనుంది. తమ జట్లు ఫైనల్‌ చేరే అవకాశాన్ని ముందే ఊహించిన చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్‌ జట్టు యాజమాన్యాలు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 90 శాతం టికెట్లు బ్లాక్‌ చేశాయి. ముందుగా అనుకున్నట్లు ఈ జట్లు ఫైనల్‌కు రావడంతో ఈ రెండు జట్ల యాజమాన్యాలు తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారితో స్టేడియాన్ని నింపుతున్నాయి.

ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంటే వాటిలో 35 వేలకు పైగా సీట్లను చెన్నై, ముంబై జట్ల యాజమాన్యాలు తీసుకున్నాయి. మిగిలిన 4,450 టికెట్లలో 2,500 టికెట్లను స్పాన్సర్‌ షిప్‌ చేసిన కార్పొరేట్‌ కంపెనీలకు ఇవ్వడంతో సామాన్య ప్రజలకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ చాలా వరకూ తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. కొద్దిమంది హైదరాబాదీలు మాత్రమే ఈ మ్యాచ్‌ చూసేందుకు అతి కష్టం మీద టికెట్లు సంపాదించుకున్నారు. దీంతో ఈ మ్యాచ్‌ చూడాలని ఆశపడ్డ వేలాది మంది స్థానిక క్రికెట్‌ ప్రియులకు తిలకించే అవకాశం లేకుండా పోయింది. నేడు జరగనున్న ఫైనల్‌ పోరు చూసేందుకు మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది శనివారం మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకున్నారు. రాజధానిలోని 3, 4, 5 నక్షత్రాల హోటళ్లు పూర్తిగా వీరితో నిండిపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు 5 వేల మంది ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌లో హోటళ్లను బుక్‌ చేశారు.  

టికెట్ల కోసం వీవీఐపీల ఒత్తిడి... 
ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం నాటి ఫైనల్‌ పోరు తిలకించేందుకు పాసుల కోసం ప్రయ త్నించిన వీవీఐపీలకు చుక్కెదురైంది. ముంబై ఫైనల్‌కు రావడంతో పరిస్థితులు మారిపోయాయని, అన్ని బాక్స్‌లు దాదాపుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బుక్‌ చేసుకుందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు టికెట్ల కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. చివరకు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులకు కూడా వీవీఐపీ పాసులు లభించలేదు. ఐపీఎల్‌ నిర్వాహకులు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కొద్ది పాసులే ఇవ్వడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

సీట్లు బ్లాక్‌.. 
ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించడానికి 39,450 మందికి అవకాశం ఉంది. వీటిలో 35 వేలకు పైగా సీట్లను ‘చెన్నై, ముంబై’ తీసుకున్నాయి. 2,500 టికెట్లను స్పాన్సర్‌ షిప్‌ చేసిన వారికి ఇచ్చారు. సామాన్యులకు మిగిల్చింది 2 వేల టికెట్లు మాత్రమే.  

హోటళ్లు ఫుల్‌.. 
మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన దాదాపు 25 వేల మంది ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నా రు. రాజధానిలోని 3, 4, 5 నక్షత్రాల హోటళ్లు పూర్తిగా వీరితో నిండిపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 5 వేల మంది ఎగ్జిక్యూటివ్‌లు మ్యాచ్‌ను తిలకించనున్నారు.  

వీవీఐపీలకు నిల్‌... 
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు టికెట్ల కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. చివరకు బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులకు కూడా వీవీఐపీ పాసులు లభించలేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కూడా కొద్ది పాసులే ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top