ప్రజావసరమా? ఓ వర్గం కోసమా? | high court on Christian Bhavan | Sakshi
Sakshi News home page

ప్రజావసరమా? ఓ వర్గం కోసమా?

Dec 28 2017 12:54 AM | Updated on Aug 31 2018 8:34 PM

high court on Christian Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం చేసిన భూ కేటాయిం పులపై హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి భూమి కేటాయింపు ప్రజావసరాల కిందకు వస్తుందా? లేదా సమాజంలో ఓ వర్గం ప్రయో జనాల కిందకు వస్తుందా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఒక వర్గం కోసమే భూమి కేటాయించినట్ల యితే మార్కెట్‌ ధర చెల్లించాకే దాన్ని స్వాధీ నం చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి కేటాయించిన భూమిని తక్షణమే సదరు భూ యజమానికి అప్పగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం స్వల్పంగా సవ రించింది. భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నందున ఆ భూమిని అలాగే అట్టిపెట్టుకో వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, నిర్మాణా లకు అనుమతులు కూడా ఇవ్వొద్దని ఆదేశించింది.

ఈ మేరకు ఏసీజే జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మధ్యంతర ఉత్తర్వులుగా భావించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఉత్తర్వులపై అభ్యంతరా లుంటే ఎత్తివేయాలని కోరుతూ సింగిల్‌ జడ్జి వద్ద అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చు నని సూచించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు ప్రభుత్వం ఏదైనా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేస్తే.. సింగిల్‌ జడ్జి ఆ పిటిషన్‌పై తమ వ్యాఖ్యల ప్రభావానికి లోను కాకుండా కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ జరిపి నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

నోటీసులు ఇచ్చినా స్పందించలేదు
అల్వాల్‌ మండలం యాప్రాల్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 124/బీలోని మూడెకరాల భూమిని ప్రభుత్వం క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణం కోసం కేటాయించింది. భూమిలో నిర్మాణ పనులను ప్రారంభించింది. క్రిస్టియన్‌ భవన్‌కు కేటాయించిన భూమి తమదని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకుందని, తమ భూమిని తమకిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎం.గంగావతి, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు పట్టాను రద్దు చేయకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. తక్షణమే మూడెకరాల భూమిని పిటిషనర్లకు స్వాధీనం చేయా లని అధికారులను ఆదేశిస్తూ ఈ నెల 19న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, మల్కాజ్‌గిరి– మేడ్చల్‌ జిల్లా కలెక్టర్, ఆర్‌డీవోలు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పంచనామా నిర్వహించిన తర్వాతే 2016లో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. భూమి స్వాధీనానికి ముందే నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నామన్నారు. అయితే నోటీసులకు పిటిషనర్లు స్పందిం చకపోవడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆ భూమి ఒకవేళ పిటిషనర్లదేనని తేలితే, వారికి పరిహారం చెల్లించడమో లేక ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడమో చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement