విదేశాలకు పంపిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై మలక్పేట పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది.
హైదరాబాద్ : విదేశాలకు పంపిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై మలక్పేట పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. బాధితుల కథనం మేరకు.. గల్ఫ్ దేశాలకు పంపిస్తానని చెప్పి పాతబస్తీ ఏబీసీ ఎంటర్ప్రైజెస్కు చెందిన ఏజెంట్ ముస్కాన్ కొందరి వద్ద రూ. 80 వేల చొప్పున వసూలు చేశాడు. వారందరిని ఢిల్లీ తీసుకెళ్లి వారం రోజులపాటు అక్కడే ఉంచి కాలయాపన చేశాడు.
అనుమానం వచ్చి వారంతా కలిసి నిలదీయడంతో కనిపించకుండా పోయాడు. తిరిగి నగరానికి చేరుకున్న బాధితులు అతని ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతని అనుచరులు వారిపై దాడికి దిగారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.