ఫిల్మ్‌నగర్‌పై ‘ట్యాక్స్‌’ నజర్‌ | GST commissionerate focus on Film Nagar | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌నగర్‌పై ‘ట్యాక్స్‌’ నజర్‌

Feb 22 2018 12:58 AM | Updated on Oct 2 2018 3:00 PM

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల నుంచి సినిమా టికెట్ల రూపేణా పన్నులు వసూలు చేసి జేబులు నింపుకుంటున్న సినీ నిర్మాతలపై హైదరాబాద్‌ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కమిషనరేట్‌ దృష్టి సారించింది. కొందరు బడా నిర్మాతలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నారని తేలడంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్‌.. వారం రోజులుగా ఓ నిర్మాతపై దృష్టిపెట్టి, పన్ను కట్టకుండా ‘రాజా’లా తిరు గుతున్న అతని వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి కేసు నమోదు చేసినట్లు సమా చారం. కొందరు బడా నిర్మాతలపైనా సెంట్ర ల్‌ ఎక్సైజ్‌ విభాగం కన్నేసినట్టు సమాచారం. 

12 శాతం పన్ను కట్టాల్సిందే.. 
జీఎస్టీ అమల్లోకి వచ్చాక సినిమా టికెట్లపై 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ ఎనిమిది నెలల కాలంలో జీఎస్టీ కింద కొన్ని సినీ నిర్మా ణ సంస్థలు రూపాయి కూడా పన్ను చెల్లించలేదని నగర జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాల పరిశీలనలో తేలింది. దీంతో ఆ శాఖ అధికారులు బడా నిర్మాతలుగా పేరుగాంచిన కొందరి సంస్థలకు చెందిన ఆడిటింగ్‌ ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఓ నిర్మాత దాదాపు రూ.7 కోట్ల మేర పన్ను చెల్లించాల్సి ఉందని తేలింది. రూ.5 కోట్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడితే కేసు నమోదు చేసే అధికారం జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులకు ఉన్నందున ఆయనపై కాగ్నిజబుల్‌ కేసు నమోదుచేశారు. దీంతో రూ.2 కోట్లు చెల్లించిన ఆ నిర్మాత మిగిలిన మొత్తం చెల్లించేందుకు గడువు కోరినట్టు సమాచారం.

ఆయనకు సమయం ఇవ్వాలా? లేక కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయా లా? అనే అంశాన్ని కమిషనరేట్‌ అధికారులు పరిశీలిస్తున్నారని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఈ రంగంతో సంబంధం ఉన్న ఆర్టిస్టులు, మ్యూజిషియన్లు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, కలర్‌ల్యాబ్‌లు, స్టూడియోల లావాదేవీలపైనా ఓ కన్నేశామని ఆ శాఖ అధికారులంటున్నారు. నగరంలోని కొన్ని బడా రెస్టారెంట్లు, కోచింగ్‌ ఇనిస్టిట్యూషన్లు, ఇన్‌ఫ్రా కంపెనీలు కూడా పన్ను ఎగవేతకు పాల్పడు తున్నాయనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. దాదాపు 500 బడా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు సమాచారం. సినీ నిర్మాతపై పన్నుకు సంబంధించి కేసు నమో దు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
Advertisement