సులభతర వాణిజ్యానికి గ్రేడింగ్‌!

Grading for easy trade - Sakshi

మార్కులిచ్చే పద్ధతికి స్వస్తి పలికిన కేంద్ర సంస్థ ‘డిప్‌’

ఇకపై పాయింట్ల విధానంలో రాష్ట్రాల పనితీరు మదింపు

సాక్షి, హైదరాబాద్‌: సులభతర వాణిజ్య విధానాల ద్వారా పారిశ్రామికీకరణ, తద్వారా ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డిప్‌) ప్రతీ ఏటా రా ష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) కోసం ఆయా రాష్ట్రాలు చేపట్టే సంస్కరణల ఆధారంగా.. ప్రపంచ బ్యాంకు సహకారంతో డిప్‌ ఈ ర్యాంకులను నిర్ణయిస్తోంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 340 అంశాల్లో రాష్ట్రాలు చేపట్టే వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బ్రాప్‌)ను ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులను ఏటా ప్రకటిస్తున్నారు. అయితే ఈ ర్యాంకింగ్‌ల విధానంపై తెలంగాణ, గుజరాత్‌  సందేహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఈఓడీబీ ర్యాంకింగ్‌ విధానాన్ని సమీక్షించిన డిప్‌.. 2019 నుంచి గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.  

ర్యాంకులకు బదులుగా గ్రేడింగ్‌ విధానం 
పారిశ్రామికీకరణలో ముందంజలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ర్యాంకింగులో వెనుకబడి పోవడం కూడా ఈఓడీబీ ర్యాంకింగ్‌పై సందేహాలకు కార ణమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. గ్రేడింగ్‌ విధానం పాటించాలని డిప్‌ నిర్ణయించగా, మార్కులకు బదులుగా దశాంశమాన పద్ధతిలో పాయింట్లు కేటాయిస్తోంది. ఒక్కో సంస్కరణకు సంబంధించి కనీసం 75కు పైగా పాయింట్లు వస్తేనే గ్రేడింగ్‌ సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన ర్యాంకింగుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసిన డిప్‌.. ఈ ఏడాది పరిశ్రమల శాఖ అందిస్తున్న సేవలను గ్రేడ్‌ల కేటాయింపులో ప్రాతిపదికగా తీసుకుంటోంది. బడ్జెట్‌లో ఏటా నిధులు కేటాయిస్తున్నా.. విడుదల కాకపోవడంపై పారిశ్రామికవర్గాలు డిప్‌ సర్వేలో ప్రతికూలంగా స్పందిం చే అవకాశముంది. ర్యాంకుల స్థానంలో టాప్‌ అచీవర్‌ (95 శాతానికి పైగా పాయింట్లు), అచీవర్‌ (90 నుంచి 95), ఫాస్ట్‌ మూవర్‌ (80 నుంచి 90), ఆస్పైరర్స్‌ (80 కంటే తక్కువ పాయింట్లు) పేరిట డిప్‌ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడ్‌లను ప్రకటించనుంది. 

ఈ ఏడాది గ్రేడింగ్‌పై ప్రభావం 
ఈ ఏడాది సులభతర వాణిజ్య గ్రేడింగ్‌లో తొలి స్థానం చేరుకునేందుకు అవసరమైన సంస్కరణల అమలుపై తెలంగాణ పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ అంశాలకు సంబంధించి చేపట్టిన సంస్కరణలపై.. పారిశ్రామికవర్గాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఈ ఏడాది ఈఓడీబీ గ్రేడింగ్‌లో కీలకం కానుంది. డిప్‌ నిర్వహించే సర్వేలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధిం చిన ప్రతిస్పందన కీలకంగా మారే అవకాశముంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top