అత్తింటి వారిపై అల్లుడు దాడి: ఇద్దరి మృతి | family disputes leads two dies in nizambad | Sakshi
Sakshi News home page

అత్తింటి వారిపై అల్లుడు దాడి: ఇద్దరి మృతి

Nov 15 2015 7:23 AM | Updated on Sep 3 2017 12:32 PM

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని ఆగ్రహించిన అల్లుడు అత్తింటిపై దాడి చేసి ఇద్దరిని హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన శివమ్మకు నర్సింహులుతో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. శివమ్మ తల్లిగారింట్లో ఉంటుంది. పలుమార్లు కాపురానికి రమ్మని నర్సింహులు కోరినా ఆమె నిరాకరించింది. దీంతో అత్తింటి వారిపై కక్ష పెంచుకున్న అల్లుడు నర్సింహులు ఆదివారం తెల్లవారుజామున అందరు నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఇంట్లోకి ప్రవేశించి భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తప్పించుకుంది.

ఇది గమనించిన ఆమె సోదరుడు సాయిలు(28) నర్సింహులును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అడ్డొచ్చిన అతని భార్య సుశీల(26)ను కూడా కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన అత్త లక్ష్మి(50), మామ(55)ల పై కూడా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు నర్సింహులును పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement