‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన పత్రాలను న్యాయస్థానం నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం తీసుకుంది.
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టుకు సమర్పించిన పత్రాలను న్యాయస్థానం నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో...ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలంటూ ఈసీ మరోసారి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి లక్ష్మీపతి అనుమతించారు. స్టీఫెన్సన్ ఫిర్యాదుతోపాటు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, సాక్షుల వాంగ్మూలాలు, రేవంత్రెడ్డి సహా ఇతర నిందితుల రిమాండ్ రిపోర్టును ఈసీ అధికారులు కోర్టు నుంచి తీసుకున్నారు.
అలాగే సీఆర్పీసీ సెక్షన్ 164 కింద స్టీఫెన్సన్, ఆయన కుమార్తె జెస్సికా, మిత్రుడు మాల్కం టేలర్ల నుంచి న్యాయమూర్తి రికార్డ్ చేసిన వాంగ్మూలాలను కూడా ఈసీ అధికారులకు అందించారు. ఈ ప్రలోభపర్వానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఆడియో, వీడియో రికార్డులతోపాటు అన్ని పత్రాలను ఇప్పించాలంటూ ఈసీ గతంలో పిటిషన్ దాఖలు చేయగా అది విచారణార్హం కాదంటూ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.