కామారెడ్డిలో ‘డ్రగ్స్’ కలకలం | Drug mafia in district | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ‘డ్రగ్స్’ కలకలం

Nov 21 2014 2:28 AM | Updated on Oct 22 2018 2:02 PM

కామారెడ్డిలో ‘డ్రగ్స్’ కలకలం - Sakshi

కామారెడ్డిలో ‘డ్రగ్స్’ కలకలం

జిల్లాలో తాజాగా డ్రగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి : జిల్లాలో తాజాగా డ్రగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఈ మాఫియా మత్తును కలిగించే దగ్గు మందులతోనే దందా నిర్వహిస్తున్న వైనం జిల్లాలో కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన ఓ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు దగ్గు మందు (పెన్సిడిల్)ను పెద్ద ఎత్తున తెప్పించి ఎక్కువ లాభాల కోసం ఇతర దేశాలకు సరఫరా చేస్తూ ఇటీవలే నిఘా సంస్థలకు చిక్కారు. ఈ సిరప్ మోతాదుకు మించి తాగితే మత్తులోకి జారుకునే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం  తయారీ కంపెనీలకు కూడా పరిమితులు విధించింది.

 ఏం జరిగింది
 కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించి కామారెడ్డిలో ఉన్న డీలర్ రెండు లక్షల పైచిలుకు కాఫ్ సిరప్ సీసాలకు ఆర్డర్ చేశా డు. సదరు కంపెనీ వారు డీలర్ సూచించిన ఏజెన్సీల పేర్లపై దగ్గు మందును సరఫరా చేశారు. కంపెనీలో పనిచేసే ఉన్నతాధికారులు ఏజెన్సీ నిర్వాహకునితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా దగ్గుమందు సీసాలను సరఫరా చేశారు. వీటిని బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యవహారంలో విచారణ చేపట్టిన ఔషధని యంత్రణ అధికారులు వివరాలను గోప్యంగానే ఉంచుతున్నారు.

మందు బాటిళ్ల తయారీ తేదీ, బ్యాచ్ నంబర్లతో పాటు వాటివెంట ఉన్న బిల్లుల ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరపగా కామారెడ్డికి చెందిన ఏజెన్సీ వివరాలు బయటపడ్డాయి. దగ్గుమందు లో ఉండే మత్తును సొమ్ము చేసుకుంటున్న డ్రగ్ మాఫియా ప్రభుత్వానికి చిక్కినా, ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

 బినామీ బిల్లులతో
  ఏజెన్సీ నిర్వాహకులు తమ ఏజెన్సీ నుంచి ఇతర ఏజెన్సీలు, దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టుగా బినామీ బిల్లులను రూపొందించి బం గ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు తేలింది. దీంతో కేసును రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు బదిలీ చేసినట్టు సమాచారం. నార్కో డ్రగ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా వ్యవహరిస్తున్నా యి.డ్రగ్ కంట్రోల్ అధికారులు కామారెడ్డి, హైదరాబాద్‌లోని సదరు ఏజెన్సీలపై దాడులు జరిపి రికార్డులను సీజ్ చేసినట్టు తెలిసింది. కాగా రికార్డుల ప్రకారమే కోటి రూపాయల విలువ కలిగిన మందు సీసాలు సదరు ఏజెన్సీకి కంపెనీ నుంచి చేరినట్లు అధికారులు గుర్తిం చారు.  పట్టుబడిన దగ్గు మందు 50 మి.లీ. బాటిల్ ధర ప్రింట్ రేట్ ప్రకారంగా రూ. 51.50 ఉండగా, బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తే రెండు వందల రూపాయల వరకు పలుకుతుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement