కైసా.. కరోనా కిస్సా!

COVID 19 Effects on Secunderabad Lodge And Tourist Places - Sakshi

కరోనా కారణంగా ఖాళీ అయిన లాడ్జీలు

కానరాని టూరిస్టులు

పడిపోయిన వ్యాపారాలు

దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే అతిథులు, పర్యాటకులు సికింద్రాబాద్‌లో బస చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించేందుకు
రైళ్లు అందుబాటులో ఉండటం ఒకటైతే.. బస చేయడం మొదలు అన్ని రకాలవసతులు ఈ ప్రాంతంలో ఉండటం మరో కారణం. నారాయణగూడ, ఉప్పల్,బొల్లారం, బేగంపేట్‌ ఇలా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నాలుగు దిక్కులాఅతిథులకు, పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చేందుకు 300 వరకు లాడ్జీలు వెలిశాయి. అందుకే సికింద్రాబాద్‌ నుంచి ఎటు10 కిలోమీటర్ల మేర పర్యాటకుల సందడి కనిపిస్తుంది. లాడ్జీలలో దిగే వారిపైఆధారపడి క్యాటరింగ్, ట్రావెల్స్‌ వ్యాపారులు జీవిస్తున్నారు. సుమారుగా5 వేల మంది యువకులు లాడ్జీలలోవార్డుబాయ్‌లుగా పనిచేస్తున్నారు. ఇంతవరకు పరిస్థితి బాగానే ఉన్నా.. దశాబ్దాల తరబడి ఎప్పుడు లాడ్జీల యజమానులు, సిబ్బంది వాటిపై ఆధారపడిన వ్యాపారులు ఇబ్బందుల్లో పడలేదు. సీజనల్‌లో ఎక్కువ.. అన్‌సీజన్‌లో తక్కువ.. అన్నట్టుగా లాడ్జీల వ్యాపారం సాగేది. 10 శాతం అటు ఇటుగా నడిచిన లాడ్జీల వ్యాపారం మూడువారాలుగా మొత్తంగా పడిపోయింది.

సికింద్రాబాద్‌: లాడ్జీల్లో బసచేసేవారే కరువైపోగా వ్యాపారం మొత్తంగా దెబ్బతిన్నది. ఇందుకు కారణం కరోనా వైరస్‌. దీని కారణంగాఅతిథులు, పర్యాటకులు నగరానికి రావడం మానేయడంతో లాడ్జీల వ్యాపారంరూ.లక్షల్లోంచి వేలల్లోకి పడిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా సికింద్రాబాద్‌నగరంలో స్తంభించిపోయిన లాడ్జీల వ్యాపారం గురించిన ప్రత్యేక కథనమిది.

5 వేలమంది రూమ్‌బాయ్స్‌..
లాడ్జీల్లో పనిచేసే రూమ్‌బాయ్స్‌కు వేతనాలు సహజంగానే తక్కువ.. వీరంతా లాడ్జీల్లో బసచేసే అతిథులు, పర్యాటకులు అందించే టిప్స్‌పైనే ఎక్కువగా ఆధారపడతారు. సాధారణంగా రూ.3 నుంచి రూ.5 వేల వరకే రూమ్‌బాయ్స్‌కు వేతనాలు ఉంటాయి. లాడ్జీల్లో బసచేసేవారి నుంచి సీజన్‌ను బట్టి నెలకు రూ.10 వేల వరకు టిప్స్‌ రూపంలో సంపాదించుకుంటారు. సికింద్రాబాద్‌ నగరంలో 300 లాడ్జీల్లో సుమారుగా 5వేల వరకు రూమ్‌బాయ్స్‌ పనిచేస్తున్నారు. వీరందరికీ ఈనెల మొదటి వారం నుంచి రోజు దమ్మిడీ ఆదాయం కూడా లేకుండా పోయింది.  

రద్దవుతున్న టూర్లు..
రెండు మూడు నెలలు ముందే నగర ప్రదర్శనకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వారంతా కరోనా దెబ్బకు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోని ప్రయాణికులు నగరానికి వస్తుంటారు. ఇందులో ముఖ్యంగా గ్రూపులుగా వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా వేల సంఖ్యలోనే ఉంటుంది. నిత్యం ఐదు నుంచి పది వేల మంది పర్యాటకులు సికింద్రాబాద్‌ ప్రాంతంలో బసచేయడం ఉండేది. కరోనా కారణంగా మొత్తంగా పర్యాటకులు నగరానికి రావడమే మానేశారు. ఏప్రిల్, మే వేసవి సెలవుల టూర్లు కూడా ముందస్తుగా రద్దు చేసుకుంటుండటంతో లాడ్జీల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.  

పడిపోయిన బుకింగ్‌లు..
లాడ్జీల్లో 20 నుంచి 60 వరకు గదులు ఉంటాయి. ప్రతిలాడ్జిలో సాధారణ సమయాల్లో సగానికి ఎక్కువ, సెలవులు తదితర సీజన్‌లలో 80 నుంచి 90 శాతం వరకు గదులు అతిథులతో నిండి ఉంటుంటాయి. ఎంత అన్‌సీజన్‌లో అయినా 30శాతం గదుల బుకింగ్‌ ఉంటుంది. కరోనా కారణంగా లాడ్జీల్లో బస చేసేవారే కరువయ్యారు. ఫలితంగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వ్యాపారం చేసే లాడ్జీల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. రోజుకు రూ.5 వేల వ్యాపారం కావడం లేదని లాడ్జీల యజమానులు వాపోతున్నారు. 

క్యాటరింగ్‌.. ట్రావెల్స్‌ అంతే..
లాడ్జీల యజమానులు, ఉద్యోగుల సంగతి పక్కనపెడితే వాటిపై ఆధారపడిన క్యాటరింగ్, ట్రావెల్స్‌ వ్యాపారాలు కూడా కుదేలవుతున్నాయి. లాడ్జీల్లో దిగే పర్యాటకులకు భోజనాలు, టిఫిన్స్‌ అందించడం ద్వారా క్యాటరింగ్‌ వ్యాపారులు బిజీగా ఉంటుంటారు. అదేతరహాలో పర్యాటకులను, అతిథులను నగరంలోని వివిధ ప్రాంతాల సందర్శన కోసం తీసుకెళ్లేందుకు ట్రావెల్స్‌ నిర్వాహకులు బీజీగా ఉండేవారు. రెండు వారాలుగా లాడ్జీల్లో బసచేసేవారే లేకపోగా అక్కడి ట్రావెల్స్‌ వాహనాలు బయట తిరిగిన దాఖలాలే లేవు.  

రెండు గదులు బుక్‌కావడం లేదు
హోటళ్లు, లాడ్జీల్లో పది గదుల్లో రెండు కూడా బుక్‌ కావడం లేదు. పర్యాటకుల సంఖ్య మొత్తంగా పడిపోయింది. లాడ్జీ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గదుల్లో బసచేసే అతిథులతోపాటు బాంకెట్‌ హాళ్లలో సందడిగా ఉండే హోటళ్లు, లాడ్జీలు మొత్తంగా బోసిపోయాయి.  – ఆనంద్‌కుమార్, లాడ్జీ నిర్వాహకుడు చిక్కడపల్లి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top