అయోమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులు | Confused Polytechnic students | Sakshi
Sakshi News home page

అయోమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులు

Aug 1 2014 3:25 AM | Updated on Sep 17 2018 7:38 PM

వెంకిపెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఇదేనేమో.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో మార్పుల కోసం జరుగుతున్న కసరత్తు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి లాటర్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్

కోదాడటౌన్ :వెంకిపెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఇదేనేమో.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో మార్పుల కోసం జరుగుతున్న కసరత్తు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి లాటర్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు సంకటంగా మారింది. వీరు ప్రవేశం పొందే ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండవ సంవత్సరం తరగతులు ప్రారంభమై నెల రోజులు దాటింది. కానీ ఈసెట్ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు నేటికీ సీట్లు అలాట్ కాకపోవడంతో అయోమయంలో పడిపోయారు.
 
 జిల్లాలో 8 మంది డిప్లమా విద్యార్థులు
 జిల్లాలో ఉన్న 46 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సుమారు 8400 మంది ఉన్నారు. డిప్లమా హోల్డర్స్‌గా పిలువబడే వీరు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. కాగా పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో మేలో ఈసెట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. జూన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ వెంటనే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చారు. ర్యాంక్ సాధించిన వారితో లాటరల్ ఎంట్రీ ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 700 ఇంజినీరింగ్ కళాశాలల్లోని 48వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో తలెత్తిన వివాదం తో వీరికి నేటికీ సీట్లు కేటాయించలేదు. దీంతో రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు.
 
 నెలరోజులుగా తరగతులు
 ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం తరగతులు జూలై 4వ తేదీ నుంచి జరగుతున్నాయి. వీరికి మొదటి సెమిస్టర్ తరగతులు అక్టోబర్‌లో పూర్తవుతాయి. ఆ వెంటనే పరీక్షలు నిర్వహించాలని యూనివర్శిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈసెట్ అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నది అధికారులకు కూడా తెలియడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement