పదవ తరగతి సిలబస్ లో మార్పు | change in the X Class syllabus | Sakshi
Sakshi News home page

పదవ తరగతి సిలబస్ లో మార్పు

May 10 2014 3:20 AM | Updated on Sep 2 2017 7:08 AM

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యాప్రమాణాలు పెంచాలని, దానికి తగ్గట్టుగానే పరీక్ష విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.

 చెన్నూర్, న్యూస్‌లైన్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యాప్రమాణాలు పెంచాలని, దానికి తగ్గట్టుగానే పరీక్ష విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతిలోని అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తిగా మార్చేశారు. కొత్తకొత్త అంశాలను పొందుపర్చారు. గతంలో 11 పేపర్లు ఉన్న పదో తరగతి పరీక్షలను 9 పేపర్లకు కుదించనున్నారు. ప్రతీ పేపర్‌కు 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయించాలని నిర్ణయించారు. గతంలో హిందీ పేపరు తప్ప మిగిలిన ఐదు సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి.

 ఈ సంవత్సరం మూడు లాంగ్వేజీ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) ఒక్కో పేపర్ చొప్పున, సైన్స్, సోషల్, గణితం సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున కుదించారు. 80 మార్కులకు నిర్వహించే పరీక్షలో 28 మార్కులు, ఇంటర్నల్‌లో కనీసం 7 మార్కులు మొత్తం 35 మార్కులు వస్తేనే ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. దీంతోపాటు హిందీలో 21 మార్కుల ఉత్తీర్ణత స్థాయిని 35 మార్కులకు పెంచేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఈ విధానాన్ని విద్యార్థులకు అలవాటు చేసేందుకు 9వ తరగతి పరీక్ష విధానంలోనూ ఈ పద్ధతి ప్రవేశపెట్టాలని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
 
 శిక్షణ ఏదీ..?
 మరో నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు అవసరం. అయితే అందుకు అనుగుణంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్ సబ్జెక్టులు చెప్పడానికి అలవాటు పడిన త మకు కొత్త సిలబస్ బోధించాలంటే తిప్ప లు తప్పవని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

గతంలో సిలబస్ మారితే శిక్షణ ఇచ్చి బోధనలో మెలకువలు చెప్పేవారని, ఇప్పుడు పదో తరగతిలో అన్ని సబ్జెక్టులు ఒకేసారి మార్చడం.. అందులో కొత్త అంశాలను చేర్చడంతో వాటిని ఎలా బోధించాలో తెలియడంలేదని ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పరీక్ష విధానంలో మార్పులు.. మరోవైపు సిలబస్‌లో మార్పులతో 2014-15 విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన అంత సులువు కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లోనే శిక్షణ ఇస్తే విద్యార్థులుకు మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement