అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు

BJP work on selection of candidates - Sakshi

కోర్‌ కమిటీ భేటీలో ప్రాథమిక చర్చ

3, 4 రోజుల్లో మరోసారి భేటీకి కమిటీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ప్రారంభించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల కోర్‌ కమిటీ సమావేశంలో దీనిపై ప్రాథమిక చర్చ జరిగింది. బీజేపీ నుంచి పోటీకి రిటైర్డ్‌ అధికారులతోపాటు కొందరు సీనియర్‌ ప్రభు త్వ అధికారులు కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్‌ ఆశించి భంగపడే నేతలెవరైనా వస్తే పార్టీ నుంచి పోటీకి దింపే అవకాశాలున్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక జాబితా సిద్ధం చేసేందుకు పార్లమెంట్‌ ఇన్‌చార్జులను నియమించారు. వారు సంబంధిత నియోజకవర్గంలో పోటీకి అర్హులైన ముగ్గురేసి సభ్యులతో జాబితాలు సిద్ధం చేస్తున్నారు.

సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ మాజీ నేత కిషన్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చేవెళ్ల నుంచి దత్తాత్రేయ సమీప బంధువు జనార్దనరెడ్డి టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు నుంచి కిషన్‌రెడ్డిని కూడా పార్టీ జాతీయ నాయకత్వం పోటీకి దింపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజిగిరి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో 3, 4 రోజుల్లో మళ్లీ భేటీ కావాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన కసరత్తులో భాగంగా సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో లక్ష్మణ్‌ సమావేశం కానున్నారు. 

కరీంనగర్‌ నియోజకవర్గంపై దృష్టి
కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుగుణాకరరావు గెలుపుకోసం కృషి చేయాల ని పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి పార్టీ టికెట్‌ ఆశించి భంగపడి రెబెల్‌గా రంగంలోకి దిగిన ఏబీవీపీ మాజీ నేత రణజిత్‌ మోహన్‌ పార్టీ పేరుతోపాటు ప్రధాని మోదీ ఫొటోతో ప్రచా రం నిర్వహించడాన్ని కోర్‌ కమిటీ తీవ్రంగా పరిగణిం చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించా రు. ఈ భేటీలో లక్ష్మణ్, దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top