ఏపీకి 28 మంది ఐఏఎస్‌లు | 28 IAS officers to allocate for andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి 28 మంది ఐఏఎస్‌లు

Oct 22 2014 3:00 AM | Updated on Sep 27 2018 5:59 PM

ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రకటించిన ప్రొవిజనల్ జాబితా ప్రకారం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మందిలో 28 మంది ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మంది
వీరిలో ఆరుగురు అధికారులు ఎక్కడివారు అక్కడే
మిగతావారు రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఉత్తర్వులివ్వాలంటూ సీఎస్‌ల ఉమ్మడి లేఖ

 
 సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రకటించిన ప్రొవిజనల్ జాబితా ప్రకారం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మందిలో 28 మంది ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆ 28 మందిని రాష్ట్రానికి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేసేందుకు 44 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. కమిటీ ప్రొవిజనల్ జాబితా ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కేటాయించబడిన ఆరుగురు అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారో ప్రస్తుతానికి అక్కడే కొనసాగించాలని, వారు మినహా మిగ తా అభ్యంతరం లేని ఐఏఎస్‌లు రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ  ఒకే లేఖపై సంతకాలు చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖకు పంపించారు.
 
 సోమవారం ఇద్దరు సీఎస్‌లు వేర్వేరుగా సంతకాలు చేసి ఐఏఎస్‌ల జాబితాలను కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎస్‌లిద్దరూ ఒకే లేఖపై సంతకాలు చేసి పంపాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇద్దరు సీఎస్‌లు ఉమ్మడి లేఖపై సంతకాలు చేసి పంపిం చారు.  తెలంగాణలో పనిచేస్తున్న బి.పి.ఆచార్య, సోమేశ్‌కుమార్‌లను ఏపీకి కేటారుుంచారు. అయితే వీరిని తెలంగాణలోనే కొనసాగించాలని సీఎస్‌లు లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పనిచేస్తున్న ఆదిత్యనాథ్ దాస్, అజయ్ సహాని, అజయ్ జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించగా.. వీరిని ఏపీలోనే కొనసాగించాలని సీఎస్‌లు కోరారు. వీరు మినహా రెండు రాష్ట్రాలకు ఐఏఎస్‌లను కేటాయిస్తూ విడుదల చేసిన జాబితా మేరకు వారు రెండు రాష్ట్రాల్లో పని చేసేందుకు వీలుగా వర్క్ టు ఆర్డర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రధానమంత్రి ఆమో దం లభించగానే  ఉద్యోగుల పంపిణీ  ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement