డీఎంకేతోనా.. చూద్దాం | Vijayakanth Christmas Celebratios | Sakshi
Sakshi News home page

డీఎంకేతోనా.. చూద్దాం

Dec 23 2014 2:02 AM | Updated on Sep 2 2017 6:35 PM

డీఎంకేతోనా.. చూద్దాం

డీఎంకేతోనా.. చూద్దాం

‘‘రానున్న ఎన్నికల్లో పొత్తు డీఎంకేతోనా... వెయిట్... ఇంకా సమయం ఉందిలే చూద్దాం ’’ అంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యానించారు.

‘‘రానున్న ఎన్నికల్లో పొత్తు డీఎంకేతోనా... వెయిట్... ఇంకా సమయం ఉందిలే చూద్దాం ’’ అంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యానించారు. దీంతో కెప్టెన్ చూపు ఎటువైపోనన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది.
 
 సాక్షి, చెన్నై : ‘‘రానున్న ఎన్నికల్లో పొత్తు డీఎంకేతోనా... వెయిట్...చూద్దాం ఇంకా సమయం ఉంది.’’ అంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యానించారు. డీఎండీకే నేతృత్వం లో కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సోమవారం క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. సాధారణంగా డీఎండీకే నేతృత్వంలో ప్రతి ఏటా అన్ని పండుగలు జరుపుకోవడం, ఆయా సామాజిక వర్గానికి చెందిన పేదలకు సాయం అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో పేదలకు విజయకాంత్ తన వంతు సంక్షేమ పథకాలను అందజేశారు. కేక్ కట్  చేశారు.
 
 బిర్యానీ విందు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు యూనిఫాంలను అందజేశారు. ఈ వేడుకలో క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు సద్గుణం, సుందరన్, స్టీఫన్ తదితరులు పాల్గొన్నారు. సద్గుణం డీఎంకే మద్దతు దారుడు. తన ప్రసంగంలో సద్గుణం విజయకాంత్‌కు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఏటా క్రిస్మస్ వేడుక సందర్భంగా విజయకాంత్ ముందు తాను కొన్ని డిమాండ్లు ఉంచుతున్నానని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సారైనా ఆయన స్పందించి తన కోరికను తీర్చుతారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
 
 సద్గుణం వ్యాఖ్యల అనంతరం విజయకాంత్ ప్రసంగించారు. సద్గుణం వ్యాఖ్యలు డీఎంకే అధినేత కరుణానిధిని ఉద్దేశించినవి అన్న విషయం ఇక్కడ ఎందరికి అర్థం అయిం దో ఏమోగానీ, తనకు మాత్రం బాగానే అర్థమైందని చమత్కరించారు. డీఎంకే కూటమిలో చేరడం విషయంగా అంటూ...వెయిట్....అందుకు సమయం ఉందని, మరో మారు సమ యం వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. దీంతో విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే వైపు నడుస్తారా? అన్న చర్చ మొదలైంది. బీజేపీ విజయకాంత్‌ను పక్కన పెట్టి ఉన్న దృష్ట్యా, తాజాగా సద్గుణం వ్యాఖ్యల మేరకు విజయకాంత్ స్పందించారన్న చర్చ మొదలైంది. డీఎంకే కూటమి విషయాన్ని తర్వాత చూసుకుందామన్న విజయకాంత్, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
 
 రద్దు చేస్తారా?: ప్రజా సీఎం అని చెప్పుకుంటు న్న జయలలిత టాటా చెప్పి పోయేస్ గార్డెన్‌లోకి వెళ్లారని, ఆ తర్వాత ఆమె ప్రజల్లోకి రాక పోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ అధినేత్రి జయలలిత పోయేస్ గార్డెన్‌కు పరిమితం కావడంతో, మంత్రులు తమ చేతికి అందినంత దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ పనుల్లో అవినీతి తాండవం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎంగా ఉన్నప్పుడు జయలలిత చేసిన 110 నిబంధనల ప్రకటనలు ఏ ఒక్కటీ అమలు కాలేదని, అయితే, అవన్నీ అమలైనట్టుగా పేర్కొంటుండడం బట్టి చూస్తే ఏ మేరకు అవి నీతి సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు.
 
 రోడ్ల మరమ్మతులకు రూ. 60 కోట్లు కేటాయించామన్నారు. అయితే, ఎక్కడా మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవని, రోడ్లన్నీ గతుకులతో దర్శనం ఇస్తున్నాయని మండి పడ్డారు. ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వివరిస్తూ, చేత కాకుంటే అసెంబ్లీని రద్దు చేసి బయటకు వెళ్లండని డిమాండ్ చేశారు. ఓ వైపు అమ్మ...అమ్మ అని జపిస్తూనే, మరో వైపు లంచం..లంచం అని ప్రజల్ని దోచుకునే పనిలో పడ్డా పన్నీరు సెల్వం మంత్రి వర్గం పనితీరును ఎండగట్టేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ఈ వేడుకలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, యువజన నేత సుదీష్, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement