చర్యలు తీసుకుంటున్నా ఫలితమేదీ? | This year's increased drunken driving cases | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకుంటున్నా ఫలితమేదీ?

Dec 16 2014 10:58 PM | Updated on May 25 2018 2:06 PM

జరిమానా విధింపుతోపాటు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న..

ఈ ఏడాది పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

సాక్షి, ముంబై: జరిమానా విధింపుతోపాటు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం జనవరి నుంచి నవంబరు వరకు 11 నెలల్లో చేపట్టిన ఈ డ్రైవ్‌లో 600 మంది పట్టుబడ్డారు. ఈ సంవత్సరం ఏకంగా 2,353 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందనే విషయం స్పష్టమైంది. గతంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మద్యం సేవించడం వల్లే జరిగినట్లు తేలింది. ఇందులో మద్యం ప్రియులు నిర్వాకంవల్ల ఏటా వందలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

అంతేసంఖ్యలో తీవ్రంగా గాయపడుతున్నారు. దీన్ని నివారించేందుకు నగరంలో అక్కడక్కడా ట్రాఫిక్ శాఖ సిబ్బంది రాత్రి వేళల్లో మద్యం ప్రియులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాకాబందీలు చేపడుతోంది. బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. కొన్ని సందర్భాలలో రక్తపరీక్ష కూడా చేయాల్సి వస్తుంది. అందులో మద్యం సేవించినట్లు తేలితే వారికి రూ.2,500 జరిమానా విధించి కోర్టులో హాజరు పరుస్తారు. తరువాత కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి వారికి జైలు శిక్ష లేదా కొన్ని నెలలపాటు డ్రైవింగ్ లెసైన్ రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీరి సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదిలాఉండగా 2011లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1,114 మంది వాహన చోదకులను పట్టుకున్నారు. అంతకు ముందు కూడా సంఖ్య అధికంగానే ఉంది. ఆ తరువాత నిబంధనలను కొంతమేర కఠినతరం చేశారు. ఇందులోభాగంగా జరిమానా జైలు శిక్ష, లెసైన్సు రద్దు కాలపరిమితిని పెంచడంలాంటివి చేశారు. దీంతో 2013లో ఈ సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ సంవత్సరం ఈ సంఖ్య ఏకంగా నాలుగు రెట్ల్లు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement