టెక్ ఎగ్జిక్యూటివ్ను కిడ్నాప్ చేసి.. | Tech executive abducted from South Delhi, looted | Sakshi
Sakshi News home page

టెక్ ఎగ్జిక్యూటివ్ను కిడ్నాప్ చేసి..

May 13 2016 10:59 AM | Updated on May 28 2018 1:37 PM

టెక్ ఎగ్జిక్యూటివ్ను కిడ్నాప్ చేసి.. - Sakshi

టెక్ ఎగ్జిక్యూటివ్ను కిడ్నాప్ చేసి..

దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు దుండగులు.. ఐటీ కంపెనీ సీనియర్ మేనేజర్ను కిడ్నాప్ చేసి, విచక్షణారహితంగా కొట్టి, దోపిడీకి పాల్పడ్డారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు దుండగులు.. ఐటీ కంపెనీ సీనియర్ మేనేజర్ను కిడ్నాప్ చేసి, విచక్షణారహితంగా కొట్టి, దోపిడీకి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

సుమిత్ చక్రవర్తి అనే ఉద్యోగి బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు ఆండ్రూస్ గంజ్ బస్టాప్ వద్ద కంపెనీ బస్ కోసం ఎదురు చూస్తుండగా,  ఆయన వద్దకు ఇద్దరు యువకులు వచ్చి తమను బీఎస్ఎఫ్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. మహారాణి బాగ్కు వెళ్లేందుకు దారి అడిగారు. కొన్ని నిమిషాల తర్వాత మరో వ్యక్తి కారులో వచ్చి నోయిడా సెక్టార్ 20కు వెళ్లే దారి అడిగాడు. ముందు వచ్చిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇవ్వాలని కోరగా మూడో వ్యక్తి అంగీకరించాడు. వారితో పాటు రావాలని ముగ్గురు యువకులు కోరగా, సుమిత్ నిరాకరించాడు. అయితే ముగ్గురు బలవంతంగా ఆయనను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. కారులోపల మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు.

కారులో నలుగురు దుండగులు సుమిత్తో గొడపపెట్టుకుని చేయిచేసుకున్నారు. ముఖంపైన, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టారు. సుమిత్ రింగులు, మొబైల్ ఫోన్, పర్స్ లాక్కున్నారు. దుండగులు మధ్యలో కారు ఆపి ఆయనతో డెబిట్ కార్డు పిన్ నెంబర్ అడిగారు. ఏటీఎంకు వెళ్లి ఆయన ఎకౌంట్ నుంచి 40 వేల రూపాయలు డ్రా చేశారు. అనంతరం నోయిడా హైవే వైపు గంటసేపు ప్రయాణించారు. పారి చౌక్ వద్ద కారు ఆపి సుమిత్ను బయటకు తోసివేశారు. ఆయన ఎడ్రెస్, వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, ఈ విషయం పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. సుమిత్ ఆటోలో ఇంటికి వెళ్లగా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమిత్ గాయాల తీవ్రతను చూసి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement