నగరంలోని పిణ్యా నుంచి మల్లేశ్వరం స్వస్తిక్ వరకు చేపట్టిన మెట్రో రైలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాదికి ఈ మార్గంలో పనులు పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు.
బెంగళూరు, న్యూస్లైన్ : నగరంలోని పిణ్యా నుంచి మల్లేశ్వరం స్వస్తిక్ వరకు చేపట్టిన మెట్రో రైలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాదికి ఈ మార్గంలో పనులు పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు. విధానసౌధలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ను ప్రవేశపెట్టిన సమయంలో పిణ్యా నుంచి మల్లేశ్వరం వరకు మెట్రో రైలు సంచారాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా పనులు అసంపూర్తిగానే ఉండడంతో అది కాస్తా నెరవేరే సూచనలు లేవు. దీంతో మెట్రో అధికారుల నుంచి సమాచారం సేకరించుకున్న సీఎం నవంబర్ చివరకు పనులన్నీ పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. అయినా ఆశించిన మేర వేగంగా పనులు పూర్తి కావడం లేదు. దీంతో నవంబర్లో కూడా పిణ్యా - మల్లేశ్వరం మార్గంలో మెట్రో రైలు సంచారం అనుమానమే.
రాజాజీ నగర మెట్రో స్టేషన్లో 95 శాతం, యశ్వంతపుర, మహాలక్ష్మి లే ఔట్ మెట్రో స్టేషన్లలో 93 శాతం పనులు పూర్తి అయ్యాయి. అలాగే మైసూరు శ్యాండిల్ సోప్ ఫ్యాక్టరీ, కువెంపు రోడ్డు, శ్రీరాంపుర ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ నిర్మాణాలు 77 శాతం పూర్తి అయ్యాయి. ఈ ఆరు స్టేషన్లలో అభివృద్ధి పనులు పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.