భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారానికి వెనకాడుతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది.
మోడీ ప్రచారంపై ఊహాగానాలకు తెర
Nov 13 2013 11:59 PM | Updated on Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారానికి వెనకాడుతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. నగరంలో మోడీ ఒకే రోజు ప్రచారం చేయడానికి అంగీకరించారని బీజేపీ గతంలో ప్రకటించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు నగరంలో మూడు రోజుల పాటు ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ అంగీకరించారని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కారీ ప్రకటించారు. నవంబర్ 23, 30, డిసెంబర్ ఒకటిన ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. ఎక్కడెక్కడ, ఎప్పుడు ర్యాలీలు నిర్వహించాలనేది తాము పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
నవంబర్ 23న మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని, అదే రోజు సాయంత్రం మోడీ ఢిల్లీలో ర్యాలీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 30న రోజంతా ప్రచారానికి ఆయన ఇదివరకే అంగీకరించారు. జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి డిసెంబర్ ఒకటిన ర్యాలీలో పాల్గొంటారు. నగరంలో ప్రచారానికి తాను అందుబాటులో ఉంటానని, పార్టీ ఎక్కడ సమావేశం ఏర్పాటుచేస్తే అక్కడ మాట్లాడడానికి మోడీ అంగీకరించారని వారు చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవన్న విషయాన్ని మోడీ అంగీకరించారని, రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. నరేంద్ర మోడీ తన ర్యాలీలలో కాంగ్రెస్ అసమర్థ పాలనపై దాడిచేస్తారని, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కుమ్మక్కును ఎత్తిచూపుతారని అంటున్నారు. మోడీతో పాటు బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వరుణ్గాంధీ, వినోద్ ఖన్నా కూడా నగరంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Advertisement
Advertisement