వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో చార్జీల పెంపును ఎమ్మెమ్మార్డీఏ వ్యతిరేకించింది...
- స్లాబ్ ప్రకారం అమలు చేయాలని విజ్ఞప్తి
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో చార్జీల పెంపును ఎమ్మెమ్మార్డీఏ వ్యతిరేకించింది. వీటికి బదులుగా స్లాబ్ ప్రకారం రూ.9, రూ.12, రూ.13లను అమలు చేయాలని కోరింది. గత జనవరి 8న చార్జీల పెంపు కోసం విజ్ఞప్తి చేయడంతో రూ.10-40 చార్జీలను పెంచేందుకు ఎంఎంఓపీఎల్కు బాంబే హైకోర్టు అనుమతించింది. మూడు నెలల్లో చార్జీలను ఖరారు చేయాలని కమిటీ ని కోర్టు ఆదేశించింది. దీంతో చార్జీలను పెంచే ముందు ప్రయాణికులు, ఇతర సంస్థల నుంచి ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అభిప్రాయాలు కోరింది.
రోజుకు దాదాపు మూడు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. ఆసక్తి ఉన్న వారు అభిప్రాయాలను రాత పూర్వకంగా లేదా ఈ-మెయిల్ ద్వారా మే నెలాఖరు లోపు సబ్మిట్ చేయాల్సిందిగా కమిటీ కోరింది. నోడల్ అధికారులకు లేదా చార్జీలను నిర్ణయించే కమిటీ (ఫేర్ ఫిక్సేషన్ కమిటీ), మెట్రో డీఎన్కు ప్రయాణికులు వాటిని పంపించాలని పేర్కొంది. పార్టీలు కూడా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్ చేయవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంఎంఓపీఎల్లో 26 శాతం వాటా ఉన్న ప్రభుత్వ ఏజెన్సీ ఎమ్మెమ్మార్డీఏ ఈ కొత్త చార్జీలను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది.


