మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు | Five persons arrested for murder of 27-year-old woman | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

Jul 26 2014 10:27 PM | Updated on Apr 4 2019 5:25 PM

స్థానిక పోలీసులు కచ్చా బనియన్ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పాత ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గత ఆదివారం ఓ మహిళ హత్యకు గురైన

 స్థానిక పోలీసులు కచ్చా బనియన్ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పాత ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గత ఆదివారం ఓ మహిళ హత్యకు గురైన సంగతి విదితమే. నిందితులను మొహబ్బత్, అనిస్ అలియాస్, ఫిర్సత్, మధు, సాగర్, రహీం అలియాస్ రాజుగా గుర్తించారు. వీరిని బుధవారం అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు హతురాలి ఇంటిలో దొంగతనం కోసం యత్నించారని, అయితే అడ్డుకోవడంతో మహిళపై దాడి చేశారని, దీంతో ఆమె చనిపోయిందని చెప్పారు. అదే రోజు రాత్రి నిందితులు అనేక నేరాలకు పాల్పడ్డారన్నారు. వీరి దాడిలో అనేకమంది స్థానికులు గాయపడ్డారన్నారు. ఈ హత్య వెనుక పెద్ద బృందమే ఉందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, వీరంతా నరేలా రైల్వే క్రాసింగ్ వద్ద ఉంటారని తెలిపారు.
 
 గత రెండు నెలలుగా ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో వీరంతా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నట్టు తెలిపారు. దీంతో మెరుపుదాడి జరిపి నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. నిందితులంతా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వాసులని తమ విచారణలో తేలిందన్నారు. వీరు ఏ ప్రాంతంలోనూ ఆరు నెలలకు మించి ఉండరని, తరచూ తమ నివాస స్థలాన్ని మారుస్తుంటారని తెలిపారు. బాగా చీకటిగా ఉన్న సమయంలోనే వీరంతా నేరాలకు పాల్పడతారని, పగటిపూట వీరంతా ఆయా ప్రాంతా ల్లో మ్యాజిక్ ట్రిక్కులను ప్రదర్శిస్తుంటారని తెలిపారు. ఆ సమయంలోనే తాము దాడికి దిగాల్సిన ప్రాంతాలను ఎంచుకుంటారన్నారు. నేరాలకు పాల్పడే సమయంలో కేవలం డ్రాయర్లు మాత్రమే ధరిస్తారని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement