రైతుల కడుపు కొట్టద్దు | Farmers stomach kottaddu | Sakshi
Sakshi News home page

రైతుల కడుపు కొట్టద్దు

Sep 21 2014 4:01 AM | Updated on Sep 2 2017 1:41 PM

చిన్న రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తే పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ హెచ్చరించారు.

బెంగళూరు :  చిన్న రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తే పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ హెచ్చరించారు. శనివారం ఆయన  ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిన్న రైతులు పోరంబోకు భూములు, అటవీ ప్రాంతానికి చెందిన భూములను అక్రమించుకుని వ్యయసాయం చేసుకుంటున్నారని అన్నారు.

ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాశానని దేవెగౌడ అన్నారు. చిన్న రైతుల భూములు లాక్కొని ప్రభుత్వం ముందు బడా బాబుల భూములు లాక్కుంటే అందరికి మంచి జరుగుతుందన్నారు.

బెంగళూరు న గరంలో, పరిసర ప్రాంతాలలో అనేక ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని ఏ.టీ. రామస్వామి, బాలసుబ్రమణ్యం కమిటీలు ఇప్పటికే నివేదిక సమర్పించారని గుర్తు చేశారు. ఈ భూములు ఆక్రమించుకున్నవారిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు ఉన్నా సరే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని దేవెగౌడ చెప్పారు. సమావేశంలో జేడీఎస్ పార్టీ నాయకులు వై.వీ.ఎస్ దత్తా, నారాయణరావ్, రతన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement