మేఘదాతులో డ్యాం అడ్డుకట్ట లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి పక్షాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడైన విజయకాంత్
- బిజీ బిజీగా విజయకాంత్
- కేంద్ర మంత్రులతో మంతనాలు
- మా వెంటేనన్న పొన్ రాధాకృష్ణన్
సాక్షి, చెన్నై: మేఘదాతులో డ్యాం అడ్డుకట్ట లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి పక్షాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడైన విజయకాంత్ ఢిల్లీలో బిజీబిజీగా గడపడం చర్చకు దారి తీస్తోంది. కేంద్ర మంత్రులతో ఆయన మంతనాల్లో మునగడంతో రాజకీయం ఎత్తుగడలు తెరమీదకు వస్తున్నాయి. అదే సమయంలో పీఎంతో భేటీ ఏర్పాట్లన్నీ చేసింది తానేనని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వెల్లడించడంతో పాటుగా విజయకాంత్ తన వెంటనేనని స్పష్టం చేయడం గమనార్హం. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి అడుగులు వేసిన డీఎండీకే నేత విజయకాంత్ క్రమంగా ఆపార్టీకి దూరం అవుతూ వచ్చారని చెప్పడం కన్నా, కమలనాథులే పక్కన పెట్టారన్నది జగమెరిగిన సత్యం.
ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలం కావడంతో విమర్శల పర్వాన్ని అందుకునే పనిలో విజయకాంత్ పడ్డారు. బీజేపీతో అంటి ముట్టనట్టు ఉన్నా, ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చాం అని ఏ సందర్భంలోనూ స్పష్టం చేయలేదు. ఈ పరిస్థితుల్లో మేఘ దాతులో కర్ణాటక కుట్రల్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రతి పక్షాల్ని ఏకం చేయడానికి విజయకాంత్ రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతి పక్ష నేత అంటే, ఇలా... ఉండాలన్న విషయాన్ని నాలుగేళ్ల అనంతరం తెలుసుకున్నా, అన్ని పక్షాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడైనా రాజకీయంగా విజయకాంత్ ఎవరికీ అంతు చిక్కరు. తన రూటే సపరేటు.
ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్నా, అన్నాడిఎంకే జై కొట్టినా, బీజేపీ జిందాబాద్ అన్నా, అది ఆయనకే సాటి. అలాంటి విజయకాంత్ తాజాగా ఢిల్లీలో బిజీబిజీగా గడపడంతో ఆయన బీజేపీతో కలసి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగులు వేయనున్నారా..? అన్న ప్రశ్న తలెత్తక మానదు. లేదా, లోక్ సభ ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకునే పయనం సాగిస్తున్నారా..? అన్న చర్చ తెర మీదకు వచ్చి ఉన్నది. అదే సమయంలో విజయకాంత్కు బిజేపీ వర్గాలే అనుమతి ఇప్పించి ఉండటంతో, ప్రతి పక్షాల్ని ఏకం చేయడంలో తెర వెనుక కమలనాథుల పాత్ర కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. విజయకాంత్ ఇప్పుడు, ఎప్పుడూ మా వెంటేనని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం.
ఢిల్లీలో బిజీ : అన్ని రాజకీయ పక్షాలతో కలసి ఢిల్లీ వెళ్లిన విజయకాంత్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అన్ని పార్టీల నాయకులు బయటకు వచ్చాక మరో మారు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది, యువజన నేత సుదీష్ నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఈ భేటీ ఆంతర్యమేమిటోనన్నది పక్కన పెడితే, అన్ని పార్టీల నాయకులు రాష్ట్రానికి తిరుగు పయనం అయినా, విజయకాంత్ మాత్రం ఢిల్లీలోనే తిష్ట వేసి ఉండడం గమనించాల్సిన విషయం. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో అర గంట పాటుగా సమావేశం జరిపి ఉన్నారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కావడం, మరి కొందరు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవడం బట్టి చూస్తే, బీజేపీని వీడి బయటకు వచ్చేందుకు విజయకాంత్ మనస్సు అంగీకరించనట్టుంది. ఈ భేటీల్లో ఆంతర్యాల్ని వెతికే పనిలో రాజకీయ విశ్లేషకులు ఉన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఓ మీడియాకు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపక మానదు.
మా వెంటే : కేంద్ర సహాయ మంత్రి పొన్రాధాకృష్ణన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయకాంత్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మా వెంటేనని స్పష్టం చేశారు. బిజేపీ రాష్ట్రంలో బలంగానే ఉందని, తమ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని విజయకాంత్ తనను కోరడం జరిగిందన్నారు. విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. అపాయింట్ మెంట్ ఇప్పించింది తానేనని స్పష్టం చేశారు. విజయకాంత్తో ప్రధాని భేటీ సంతృప్తికరంగా సాగిందని పేర్కొంటూ, ఆయన తమ కూటమిలో లేరని చెప్పిందెవరని ప్రశ్నించారు.
తాజా, పరిస్థితుల్ని ఎన్నికల కూటమిగా మార్చే యోచనలో డిఎంకే ఉండొచ్చేమోగాని, లోక్ సభ ఎన్నికల్లో ఏర్పడ్డ తమ కూటమిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదన్నారు. పీఎంకే సీఎం అభ్యర్థిని ప్రకటించినా, అది ఆచరణలో పెట్టేది కష్టమేనని, తమ కూటమి కొనసాగుతుందని, విజయకాంత్ తమ వెంటనేనని స్పష్టం చేయడం గమనార్హం. ఇక, విజయకాంత్ ఢిల్లీ పర్యటనను అన్నాడీఎంకే వర్గాలు వ్యంగ్యాస్త్రాలతో చమత్కరించే పనిలో పడ్డారు. అలాగే, ప్రధాని తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న వేదనలో ఉన్న విజయకాంత్, మేఘదాతు అస్త్రాన్ని సంధించి తన స్వలాభం కోసం ఢిల్లీకి వెళ్లినట్టున్నారని ఆరోపించే పనిలో పడ్డారు.