‘ధర్మ స్థల’ ఘటనపై న్యాయం కోసం.. | 'Dharma space' ghatanapai for justice .. | Sakshi
Sakshi News home page

‘ధర్మ స్థల’ ఘటనపై న్యాయం కోసం..

Oct 22 2013 1:02 AM | Updated on Sep 1 2017 11:50 PM

దక్షిణ కన్నడ జిల్లా ధర్మ స్థలలో సుమారు ఏడాది కిందట సౌజన్య అనే విద్యార్థిని ‘హత్యాచారం’పై నెలకొన్న వివాదం రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్రమవుతోంది.

 

= ‘హత్యాచారం’పై రాజుకుంటున్న వివాదం
 = ఏడాది అయినా వీడని మిస్టరీ
 = కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు
 = ధర్మస్థల ధర్మాధికారి హెగ్డేపై ఆరోపణలు
 = హెగ్డేకు మద్దతిస్తున్న పలువురు మఠాధిపతులు
 = లైంగిక దాడికి నిరసనగా ఊపందుకుంటున్న ప్రదర్శనలు

 
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దక్షిణ కన్నడ జిల్లా ధర్మ స్థలలో సుమారు ఏడాది కిందట సౌజన్య అనే విద్యార్థిని ‘హత్యాచారం’పై నెలకొన్న వివాదం రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే సీఐడీ దీనిపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ, నత్త నడకలా సాగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సౌజన్యపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన వారిని ధర్మ స్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే వెనకేసుకొస్తున్నారని పలువురు ఆరోపిస్తుండగా, ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై ఎలాంటి దర్యాప్తు అయినా, ఆఖరికి సీబీఐ దర్యాప్తు జరిపించినా తనకు సమ్మతమేనని హెగ్డే తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వస్తుండడంతో ఎలాంటి విచారణకైనా సిద్ధమని బహిరంగంగానే ప్రకటించారు.

వివాదం తీవ్రమవుతుండడంతో పలువురు మఠాధిపతులు హెగ్గడేకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాను సౌజన్య తల్లిదండ్రులను కలుసుకున్నప్పుడు, వారు కూడా  హెగ్డేపై ఆరోపణలు చేయలేదని ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ తెలిపారు. అయితే దర్యాప్తు సరైన దిశలో సాగనందున, తమకు న్యాయం జరగక పోవచ్చనే సందేహాన్ని మాత్రమే వారు వెలిబుచ్చారని వివరించారు. సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారని తెలిపారు.

మరో వైపు రాజకీయ పలుకుబడితో  హెగ్డే కుటుంబ సభ్యులు ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న నాగరిక సేవా ట్రస్టుకు కూడా క్రమేణా మద్దతు పెరుగుతోంది. కాగా దీనిపై బెంగళూరు, మైసూరు, ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు, బెళ్తంగడి, పుత్తూరులలో నిరసన ప్రదర్శనలు ఊపందుకుంటున్నాయి.

సౌజన్య కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకాంక్షించారు. త్వరలోనే దర్యాప్తును ముగించి, రెండో చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు తనకు చెప్పారని వివరించారు. తనకు వీరేంద్ర హెగ్గడేపై గౌరవం ఉందంటూ, ఆయన కూడా సౌజన్య కుటుంబానికి సామాజిక న్యాయం జరగాలనే కోరుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement