ఎంత పని చేశావ్‌ భువీ..? | World Cup 2019 Team India Lose Review On First Ball In Semis | Sakshi
Sakshi News home page

ఎంత పని చేశావ్‌ భువీ..?

Jul 9 2019 7:43 PM | Updated on Jul 9 2019 8:16 PM

World Cup 2019 Team India Lose Review On First Ball In Semis - Sakshi

మాంచెస్టర్ ‌: ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తొలి ఓవర్‌ తొలి బంతికే రివ్యూకు వెళ్లి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. బుధవారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌- టీమిండియా మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ రివ్యూ భారత్‌కు ప్రతికూలంగా రావడంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు, అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా భువనేశ్వర్‌, కోహ్లిలను విమర్శిస్తున్నారు. (చదవండి: ఇదేంటి.. జట్టులో షమీ లేడు? )
‘తొలి బంతికే రివ్యూ కోల్పోయాం.. ఇక డీఆర్‌ఎస్‌ లేకుండానే మిగిలిన 299 బంతులు వేయాలి’. ‘సెమీస్‌ వంటి కీలక మ్యాచ్‌ల్లో రివ్యూ ఎంతో కీలకం.. దానిని వినియోగించుకోవడంలో కోహ్లి విఫలమ్యాడు’, ‘భువీ తొలి బంతికే ప్రత్యర్థి జట్టుకు బూస్ట్‌ ఇచ్చాడు’, ‘ఎంత పని చేశావ్ భువీ’అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో షమీని కాదని భువీని తీసుకోవడం పట్ల కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

అసంలేం జరిగిందంటే..
మ్యాచ్‌ ప్రారంభమైన వెంటనే టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోలస్‌లు ఆరంభించారు. కాగా, భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. తొలి ఓవర్‌ను భువనేశ్వర్‌ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్‌ సాధించినంత పని చేశాడు.  భువీ వేసిన తొలి ఓవర్‌ మొదట బంతిని గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్‌ బ్యాట్‌ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత్‌ అప్పీల్‌ చేయగా, ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దానిపై భారత్‌ చివరి క్షణాల్లో రివ్యూకు వెళ్లడంతో ఆ బంతి లెగ్‌ స్టంప్‌కు అతి సమీపం నుంచి బయటకు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. దాంతో భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో మొదటి బంతికే భారత్‌ రివ్యూ కోల్పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement