తుది పోరుకు తెలంగాణ జట్లు | Telangana Teams to Final Fight of Badminton Championship | Sakshi
Sakshi News home page

తుది పోరుకు తెలంగాణ జట్లు

Oct 6 2018 10:25 AM | Updated on Oct 6 2018 10:25 AM

Telangana Teams to Final Fight of Badminton Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యోనెక్స్‌ సన్‌రైజ్‌ సౌత్‌జోన్‌ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు జూనియర్స్, సీనియర్స్‌ విభాగాల్లో ఫైనల్‌కు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన సీనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో తెలంగాణ 3–0తో కేరళపై గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్‌–సృష్టి జూపూడి (తెలంగాణ) ద్వయం 21–18, 21–13తో బాలసుబ్రమణియం–నఫీసా సారా సిరాజ్‌ (కేరళ) జోడీపై గెలిచి శుభారంభాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సిరిల్‌ వర్మ (తెలంగాణ) 21–19, 21–15తో మొహమ్మద్‌ మునావర్‌పై నెగ్గాడు.

తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి (తెలంగాణ) 16–21, 21–18, 21–13తో ఆద్య వరియత్‌ను ఓడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్‌ ఫలితం తేలిపోవడంతో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లను నిర్వహించలేదు. జూనియర్స్‌ సెమీస్‌లో తెలంగాణ 3–1తో కేరళపై గెలుపొందింది. తెలంగాణ తరఫున బాలికల సింగిల్స్‌లో సామియా ఇమాద్‌ ఫరూఖీ, బాలుర డబుల్స్‌లో పి. విష్ణువర్ధన్‌–పి. శ్రీకృష్ణ సాయికుమార్, బాలికల డబుల్స్‌లో బండి సాహితి–సృష్టి జూపూడి జోడీలు విజయం సాధించాయి. మరో సెమీస్‌లో కర్ణాటక 3–2తో ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గింది.  

Advertisement
 
Advertisement
Advertisement