దక్షిణాఫ్రికా టార్గెట్ 135
బెంగళూరు: దక్షిణాఫ్రికాతో మూడో టీ20ల సిరీస్లో భాగంగా ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా 135 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. శిఖర్ ధావన్(36; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మోస్తరుగా రాణించడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ మూడు వికెట్లతో ఆకట్టుకోగా బిజోర్న్, బి హెండ్రిక్స్లు తలో రెండు వికెట్లు సాధించారు. షమ్సికి వికెట్ దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ(9) విఫలం కావడంతో భారత్ జట్టు 22 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఆపై ధావన్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కాగా, 63 పరుగుల వద్ద ధావన్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేదు. కోహ్లి(9) నిరాశపరచడంతో భారత్ 68 పరుగుల వద్ద మూడో వికెట్ను నష్టపోయింది. అటు తర్వాత రిషభ్ పంత్(19), శ్రేయస్ అయ్యర్(5), కృనాల్ పాండ్యా(4)లు కూడా విఫలం కావడంతో భారత్ స్కోరు మందగించింది. ఆఖర్లో హార్దిక్ పాండ్యా-జడేజాలు స్కోరు బోర్డును చక్కదిద్దే యత్నం చేసినప్పటికీ వీరి బ్యాట్ నుంచి మెరుపులు రాలేదు. జడేజా(19), హార్దిక్(14)లు చివరి ఓవర్లో ఔట్ కావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.